వైసీపీలో మరో ముసలం పుట్టిందా? మరో ఎమ్మెల్యే పార్టీ గీతను దాటుతున్నారా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్కు ఏమాత్రం అనుభవం లేదని ఆయన అనడం .. రాజకీయంగా పార్టీలో వివాదానికి ఆజ్యం పోసింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను ఇదే కారణంగా.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇక, సాయిప్రసాద్.. మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్కు అనుభవం లేదని.. అందుకే రాష్ట్రంలో అభివృద్ది జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పార్టీలో ఎమ్మెల్యేలుగా తమకు ఏమా త్రం స్వతంత్ర లేకుండా పోయిందని వస్తున్నవార్తలను ఖండించలేనని ఆయన చెప్పారు. అసంతృప్తి ఉందో లేదో.. మీడియాకు తెలుసుకదా? అని వ్యాఖ్యానించారు. మరో ఐదేళ్లు ఆయనకు అవకాశం ఇస్తే.. అప్పుడు అనుభవం రావొచ్చునని వ్యాఖ్యానించారు.
గడప గడపకు కార్యక్రమంలో తాను పాల్గొన్న ప్రతిసారీ.. అనేక ఇబ్బందులు పడ్డానని చెప్పారు. తనను ప్రజలు పట్టించుకోవడం మానేశారని.. దీనికి కారణం.. తానా.. పార్టీనా.. అనేది తెలియదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలనే కోరుకుంటున్నామని.. కానీ.. అనుకున్నవి అన్నీ జరుగుతాయా? లేదా.. అనేది ప్రజలు నిర్ణయిస్తారని..తాను ఏమీ చెప్పలేనన్నా.. ఇంటింటికీ.. స్టిక్కర్లు అంటించే కార్యక్రమం బాగానే ఉందన్నారు.