పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో మూవీ రాబోతుంది. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటన చేసింది. సోషల్ మీడియా వేదికగా గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ కానుందని మైత్రి వారు వెల్లడించారు. త్వరలోనే దీని గురించిన పూర్తి వివరాలు చెబుతామని ప్రకటించింది.
ఇదిలా ఉంటే పవన్ ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ సినిమా రీమేక్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇందులో కథానాయికగా రెజీనాను ఎంపిక చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ను చెప్పాపెట్టకుండా పూర్తి చేసేశారు. ఇలా ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగానే, పవన్ క్రిష్ దర్శకత్వంలో జానపద నేపథ్యం ఉన్న సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు.
ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్, ఫిబ్రవరి4 నుంచి మొదలు కానుంది. క్రిష్ సినిమా మొదలు కాకమునుపే హరీష్తో పవన్ సినిమా ఉంటుందని మైత్రి సంస్థ ప్రకటన చేసింది.