ఇది నిజంగానే వైసీపీ అధినేత జగన్కు ఘోర అవమానం లాంటిదే. జనసేన పార్టీని అసలు వైసీపీ వాళ్లు లెక్కలోకి తీసుకోవటం లేదు. అలాంటి సమయంలో వైసీపీకి చెందిన ఒక టాప్ లీడర్ ఇప్పుడు జనసేనలోకి జంపు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ నేత ఎవరో కాదు మాజీమంత్రి, ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత దాడి వీరభద్రరావు. అధ్యాపకుడిగా ఉంటూ ఎన్టీఆర్ దయతో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.
ఆయనను రాజకీయ మేధావిగా పేర్కొంటారు. ఐదుసార్లు వరుస విజయాలు సాధించిన దాడి 2004లో తొలిసారి ఓడిపోయారు. 2007లో శాసనమండలి నుంచి గెలిచారు. అయితే 2013లో వైసీపీలో చేరిన దాడి తన కుమారుడు రత్నాకర్కు విశాఖ నార్త్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు. 2004 ఎన్నికలలో రత్నాకర్ ఓడిపోయారు. అయితే దాడి వైసిపిపై తీవ్ర విమర్శలు చేస్తూ తిరిగి టిడిపిలోకి వచ్చారు. టిడిపిలో ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ వైసీపీలో చేరారు.
అక్కడ టిక్కెట్ ఇవ్వలేదు. 2024 లోను దాడికి లేదా ఆయన వారసుడికి టిక్కెట్ వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. ఇప్పటికే అనకాపల్లిలో యువ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాగా వేశారు. దీంతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు దాడి జనసేనలోకి వెళుతున్నట్టు తెలుస్తోంది. జనసేనలోకి వెళితే పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు తెచ్చుకుంటే తన కొడుకు రత్నాకర్ ఎమ్మెల్యే అవుతాడు అన్నది దాడి లెక్కలు.
అసలు జనసేన పార్టీని వైసిపి అధినేత లెక్కలోకి తీసుకోవడం లేదు. అలాంటి టైంలో తమ పార్టీకి చెందిన ఒక సీనియర్ లీడర్ ఇప్పుడు జనసేనలోకి వెళ్ళటం జగన్కు ఘోర అవమానం లాంటిదే అన్న చర్చలు ఏపి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటు జనసేన వాళ్లు కూడా తమ పార్టీలోకి అధికార పార్టీ నుంచి కీలక నేతలు వస్తుండడంతో ఉత్సాహంతో ఉన్నారు.