ఈ సారి ఎన్నికల్లో కంచుకోటల్లో వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలేలా ఉన్నాయి. గత రెండు ఎన్నికల నుంచి గెలుస్తూ వస్తున్న స్థానాల్లో వైసీపీకి ఈ సారి గెలవడం కష్టమనే పరిస్తితి. వరుసగా గెలుస్తూ వస్తున్న, ఇప్పుడు అధికారంలో ఉన్న ఆయా నియోజకవర్గాలకు ఒరిగింది ఏమి కనబడటం లేదు. పైగా వరుసగా గెలుస్తూ వస్తున్న ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది.
ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. రాజకీయంగా ఈయన బలమైన నాయకుడు. అందుకే వరుసగా మూడుసార్లు గెలిచారు. 2009లో ఈయన మంత్రాలయం నుంచి టిడిపి తరుపున గెలిచారు. కానీ తర్వాత టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి 7 వేల ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్ధి తిక్కారెడ్డిపై పోటీ చేసి గెలిచారు.
అయితే తిక్కారెడ్డి అంతకముందు వైసీపీలో పనిచేసేవారు. కానీ ఆయన రివర్స్ లో టిడిపిలోకి వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో కూడా వారి మధ్యే పోటీ జరిగింది. ఇక వైసీపీ గాలి, టిడిపిపై వ్యతిరేకత నేపథ్యంలో మరొకసారి బాలనాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. ఇక ఈసారి వైసీపీ అధికారంలోకి రావడంతో నాగిరెడ్డి ఏదో చేసేస్తారని మంత్రాలయం ప్రజలు అనుకున్నారు. కానీ ప్రభుత్వ పరంగా పథకాలు వస్తున్నాయి తప్ప..అనుకున్న స్థాయిలో అభివృద్ధి లేదు.
పైగా వరుసగా ఓడిపోతున్న తిక్కారెడ్డి ప్రజల్లో ఉంటున్నారు..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే ఓడిపోయిన సానుభూతి ఆయనపై ఉంది. దీంతో మంత్రాలయంలో ఆధిక్యం మారిందని ఇటీవల సర్వేల్లో తేలింది. ఈ సారి నాగిరెడ్డి గెలుపు కష్టమనే పరిస్తితి. వరుసగా ఓడిపోతున్న తిక్కారెడ్డి ఈ సారి మంత్రం నాగిరెడ్డికి చెక్ పెట్టడం ఖాయమని తెలుస్తోంది.