వైసీపీలో చాలామంది మంత్రుల పరిస్తితి సరిగ్గా లేదనే చెప్పాలి. పేరుకే మంత్రులు తప్ప..ప్రజలకు చేసేదేమీ కనిపించడం లేదు. అలాగే వారి వారి శాఖల పరంగా పట్టు సాధించడం లేదు..పనులు చేయడం లేదు. కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికి, జగన్ కు భజన చేయడానికే మంత్రులు అన్నట్లు ఉంది. అలాంటి మంత్రులపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. అలా వ్యతిరేకత ఎదురుకుంటున్న వారిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారనే చెప్పాలి.
ఈయన ఈ మధ్య ఎంత ఎక్కువ ట్రోల్ అవుతున్నారనేది చెప్పాల్సిన పని లేదు. ఇక ఈయన ప్రజా వ్యతిరేకత మాత్రమే కాదు..సొంత పార్టీలో కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావుతో కయ్యం ఉన్న విషయం తెలిసిందే. ఆ కయ్యం ఇప్పుడు మరింత ఎక్కువైంది. తాజాగా అమర్నాథ్..బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అనకాపల్లి పట్టణం నెహ్రూ చౌక్ రోడ్డులోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అరిపించారు.
ఆ తర్వాత మంత్రి ప్రసంగిస్తుండగా, పక్కనే ఉన్న డీవీఎన్ డిగ్రీ కళాశాలలోని ఓ విద్యార్ధి జై జనసేన అనడంతో..అతన్ని పట్టుకోవాలని మంత్రి..పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం, పోలీసులు, వైసీపీ శ్రేణులు కాలేజీలోకి వెళ్ళి అల్లకల్లోలం సృష్టించి..విద్యార్ధిని ఈడ్చి కొట్టారు. అయితే ఆ కాలేజీ దాడి వీరభద్రరావు వాళ్ళది..దీంతో ఆయన తనయుడు రత్నాకర్..ఈ అంశంపై కాలేజీలోకి వచ్చి హల్చల్ చేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. డిఎస్పికి ఫిర్యాదు చేశారు.
అయితే ఈ వివాదం కాస్త ఇంకా ముదురుతూ వెళుతుంది. మంత్రితో పడక ఇప్పటికే దాడి ఫ్యామిలీ వైసీపీకి దూరం జరిగింది. ఇక ఇప్పుడు మంత్రికి చెక్ పెట్టడానికి దాడి ఫ్యామిలీ జనసేనలో చేరే ఛాన్స్ కూడా ఉందని ప్రచారం వస్తుంది. అనకాపల్లిలో జనసేనకు బలం ఉంది. టిడిపి-జనసేన గాని కలిస్తే..అమర్నాథ్కు చెక్ పడుతుంది. ఆ దిశగానే దాడి ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.