ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అనూహ్యంగా టీడిపి అభ్యర్థి పంచమర్తి అనురాధ విజయం సాధించారు. అధికార వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడిపికి క్రాస్ ఓట్ చేయడంతో టీడిపి అభ్యర్థి ఏకంగా 23 ఓట్లు సాధించి విజయం సాధించారు. వైసిపి ఇప్పటికే క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు అటు వైసిపి వర్గాలలోను.. ఇటు ఏపీ రాజకీయ వర్గాలలో పార్టీ నుంచి మరికొంతమంది బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. వీరంతా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారన్న చర్చలు నడుస్తున్నాయి.
వచ్చే ఎన్నికలలో జగన్ ఏకంగా 70 మందికి పైగా ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేస్తున్నారు. ఇలా చెప్పడంతోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి, ఆనం లాంటి నేతలు తమ అసంతృప్తిని ఎమ్మెల్సీ ఎన్నికలతో బయటపెట్టుకున్నారని.. తమ బాధ చెప్పుకోలేని ఎమ్మెల్యేలు మరికొద్ది రోజుల పాటు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మొత్తం 11 మంది నేరుగా చంద్రబాబుతోనే టచ్ లో ఉన్నారని టీడిపిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అచ్చెం నాయుడు కూడా ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేలు టీడిపితో టచ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఆయన మాటలను ఎవరు నమ్మలేదు. ఎప్పుడు ? అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారో… అప్పటినుంచి ఆ మాట నిజం అనిపిస్తుంది.
ఇక చంద్రబాబుతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడే పార్టీలోకి వస్తాం.. తమకు టిక్కెట్ కన్ఫర్మ్ చేయండి చాలు అని వేడుకుంటున్నారట. ఇప్పుడే ఆ నేతలను పార్టీలోకి తీసుకుంటే ఇటు టీడిపిలో ఆయా నియోజకవర్గాలలో టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న నేతల్లో అసంతృప్తి భబగ్గు మంటుందని.. అందుకే చంద్రబాబు ఎటు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా సాధారణ ఎన్నికలకు మరో ఆరు నెలల ముందు నుంచే వైసిపి నుంచి చాలామంది టీడిపిలోకి జంపింగ్ చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది.