Mohan Banu : ఇకపై ఎవరూ షిర్డీ వెళ్లాల్సిన అవసరం లేదు.. మోహన్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు..!

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రముఖ నటుడు మోహన్ బాబు(Mohan Banu) మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. సాయినాథుడి భక్తులు తాను కట్టించిన ఆలయానికి వస్తే చాలని, ఇకపై షిర్డీ కి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించడంతో బాబా భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా రంగంపేటలో మోహన్ బాబుకు శ్రీ విద్యానికేతన్ అనే విద్యా సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రాంగణంలో మోహన్ బాబు సాయి బాబా ఆలయాన్ని కట్టించారు. ఇవాళ ఆ ఆలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ రంగంపేటలో నేను అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాను. ఇక బాబా భక్తులు ఎవరు షిర్డీ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడికే వచ్చి స్వామి వారిని దర్శించు కోవచ్చు. శ్రీ విద్యానికేతన్ వద్ద ఆలయాన్ని కట్టాలని భావించినప్పుడు విష్ణు ఒక మాట అన్నాడు. డాడీ ఆలయాన్ని కడితే తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఇక్కడికి వచ్చి బాబాను దర్శించుకోవాలి. అంతటి స్థాయిలో ఆలయాన్ని నిర్మించాలని కోరాడు. విష్ణు చెప్పినట్లే అద్భుతమైన గుడిని నిర్మించా.

రుషికేశ్ సహా అనేక పవిత్ర స్థలాల నుంచి మూలికలు, చెక్కలు తీసుకొచ్చి పీఠం కింద ఉంచాం. ఇంతటి పవిత్రమైన ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఇక షిర్డీకి వెళ్లాల్సిన అవసరం లేదు’ అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు. అయితే మోహన్ బాబు(Mohan Banu) చేసిన వ్యాఖ్యల పట్ల బాబా భక్తులు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. షిర్డీ ఆలయం పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

Tags: manchu mohan b, mohan babu