కొన్ని విషయాలు అర్థం కావాలంటే అంతా సర్వం నాశనం అయిపోయాక పక్కనున్న వాళ్ళు చెబితే కానీ మనకు అర్థం కావు. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు మన దగ్గర ఎంతో గొప్ప విషయం.. ఎంతో గొప్పతనం ఉన్నా అది మనకు నచ్చదు. పొరుగు ఇంట్లో ఉన్న పుల్లకూర రుచి అన్నట్టుగా ఆశపడుతూ ఉంటాం. లేకపోతే మన మధ్య ఉన్న ఈగోలు, ఆధిపత్య పోరాటాలు.. ఇతర రాజకీయ ప్రయోజనాలు అన్ని కలిసి మన సంస్కృతి, మన గొప్పతనాన్ని మనకు తెలియకుండా కళ్ళకు గంతులు కట్టేస్తాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అని ప్రశ్నించుకుంటే ఎవరు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ చాలా అభివృద్ధి జరిగింది అన్నది వాస్తవం. మరోసారి ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికి అమరావతి జాతియ స్థాయిలో బాగా పాపులర్ అయ్యి ఉండేది. ఎప్పుడు ? అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో రాజధానిపై వైసిపి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి ఒక్కసారిగా కుప్పకూలింది. చంద్రబాబు అమరావతిని ప్రపంచ స్థాయిలోనే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని భావించారు. అందుకే ఆయన ఉన్నప్పుడు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెట్టింది. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రైతులు 33 వేల ఎకరాలు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇప్పుడు వైసిపి ప్రభుత్వంలో మూడు రాజధానులు ప్రకటనతో అమరావతి పూర్తిగా నాశనం అయ్యింది.
అక్కడ అభివృద్ధి అన్న మాటే లేదు. అయితే అమరావతి ఎంత గొప్పదో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. అమరావతి అలాగే కొనసాగి ఉంటే హైదరాబాద్ ను మించి ఉండేదని ఆయన ఒప్పుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 7000 చదరపు కిలోమీటర్లు గా ఉందని.. కనుచూపుమేరలో హైదరాబాద్ ను బీట్ చేసే నగరం ఏదీ లేదని కేటీఆర్ చెప్పారు.
ఒకవేళ అమరావతి మెట్రోపాలిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యరూపం దాల్చి ఉంటే.. హైదరాబాద్ ని మించిపోయి ఉండేదని.. అయితే ఇప్పుడు అక్కడ కార్యకలాపాలు ఏవి లేవు కాబట్టి.. హైదరాబాద్ గ్రేట్ అని చెప్పారు. అలాగే కేటీఆర్ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కూడా బాగానే పనిచేస్తున్నాయని… తాను రాజకీయ విమర్శలు చేయడం లేదని.. ఒక పోలిక హైదరాబాద్ గురించి చెప్పడానికే అమరావతిని ఉదాహరణగా తీసుకున్నానని చెప్పారు. ఏదేమైనా అమరావతి అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఏ రేంజ్లో ఉండేదో కేటీఆర్ మాటలే చెప్పాయి. మరి ఆంధ్రోడికి ఈ విషయం రాజకీయాలతో సంబంధం లేకుండా అర్థమవ్వాల్సి ఉంది.