ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడిపి అభ్యర్థి అనురాధ విజయం సాధించారు. వైసిపి నుంచి పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులలో విశాఖపట్నంకి చెందిన కోలా గురువులు ఓటమి పాలయ్యారు. వైసిపిలో కోలా గురువులు అంతా దురదృష్టవంతుడు అయిన నేత ఎవరు లేరనే చెప్పాలి. వైసిపికి ఇప్పుడున్న బలం నేపథ్యంలో అలా నామినేషన్ వేస్తే చాలు సింపుల్గా పదవి వచ్చేస్తుంది. అయితే కోలా గురువులు గత 15 సంవత్సరాలుగా చట్టసభల్లోకి అడుగు పెట్టాలని అధ్యక్షా అనాలని ఎంతో ఉబలాటపడుతున్న ఆయన కోరిక మాత్రం నెరవేరటం లేదు.
రాజకీయాల్లో పెద్ద దురదృష్టవంతుడిగా ఆయన మరోసారి మిగిలిపోయారని చర్చ తెరమీదకు వచ్చింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు విశాఖపట్నంలో 1, 2 నియోజకవర్గాలు ఉండేవి. అప్పట్లో వైజాగ్ సిటీలో ద్రోణం రాజు సత్యనారాయణ, పల్లా సింహాచలం రాజకీయంగా పెద్ద నాయకులుగా ఉండేవారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన లో విశాఖలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నాలుగు నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. సౌత్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం తరఫున కోలా గురువులు పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి ద్రావణం రాజు శ్రీనివాస్ తాను ఓడిపోయానని భావించి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. గెలుపు తనదే అని కోలా గురువులు సంబరాలు కూడా ప్రారంభించేసి బాణాసంచా కాల్చి పండగ చేసుకున్నారు.
అయితే చివరిలో ఫలితం మారింది ద్రోణం రాజు శ్రీనివాస్ అనుహ్యంగా 341 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో గురువులకు అదిరిపోయే షాక్ తగిలింది. ఇక 2014లో వైసిపి నుంచి పోటీ చేసిన గురువులు టీడిపి అభ్యర్థి వాసుపల్లి గణేష్ చేతిలో 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పుడు కూడా లక్ కలిసి రాలేదు. ఇక 2019 ఎన్నికలలో ఆయనకు వైసీపీ నుంచి టికెట్ దక్కలేదు తాను రాజకీయ గురువుగా భావించే ద్రోణంరాజు వైసీపీలో చేరడంతో జగన్ ఆయనకే సీటు ఇచ్చారు. వైసిపి సునామీలో కూడా వైజాగ్ సౌత్లో ద్రోణంరాజు ఓడిపోయారు. ఆయన కరోనాతో 2020లో మరణించారు. ఇక టీడిపి నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కూడా వైసిపికి దగ్గర అయ్యారు. దీంతో గురువులు క్రమంగా వైసిపికి దూరం జరుగుతున్నట్టే కనిపించింది. అయితే జగన్ ఆయనకు ఇచ్చిన హామీ మేరకు ఏపీ మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.
తాజాగా ఎమ్మెల్యే కోటా ఎన్నికలలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నిన్న జరిగిన కౌంటింగ్ లో కూడా ముందు కోలా గురువులు గెలిచినట్టు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే చివరకు రెండో ప్రాధాన్యత ఓట్లలో కైకలూరుకు చెందిన జయ మంగళ వెంకటరమణ గెలిచినట్టు ప్రకటించగా.. కోలా గురువులు ఓడిపోయారు. ఏది ఏమైనా ఒక్క ఓటు తేడాతో ఆయన ఎమ్మెల్సీ పదవి పోగొట్టుకున్నారు. ఇలా 15 సంవత్సరాలపాటు చట్టసభల్లోకి అడుగు పెట్టాలని ఎన్నో కలలు కంటున్నా గురువులు మరోసారి రాజకీయ చదరంగంలో దురదృష్టవంతుడిగా మిగిలిపోయారు.