జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతోంది. ఇప్పటివరకు ఎన్ని అసంతృప్తులు ఉన్నా.. అవి బయటపడలేదు. ఒక్క రఘురామ కృష్ణంరాజు మాత్రం గత రెండేళ్ల నుంచి అసంతృప్త ఎంపీగా ముద్ర వేసుకున్నారు. ఇక తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అసంతృప్త నేతలు ఒక్కసారిగా బయటపడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ లైను ధిక్కరించి ఓటు వేశారన్న అనుమానంతో జగన్ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు.
వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన నలుగురు ఎమ్మెల్యేలలో ఏకంగా ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీఠ వేస్తూ వస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు.. సాధారణ జనాలే కాదు. పార్టీలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతల్లోనూ తరచూ ఇదే చర్చ జరుగుతుంది. ఎంతమందికి ఏయే పదవులు దక్కాయి అన్న లిస్ట్ కూడా సోషల్ మీడియాలో పేర్లతో సహా వైరల్ అవుతోంది..
పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన వారందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే..! జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎమ్మెల్యే కూడా పార్టీ లైను ధిక్కరించిందన్న సాకుతో ఆమెను కూడా పార్టీ నుంచి బయటకు పంపేశారు, విచిత్రమింటంటే జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు జగన్కు దెబ్బ కొట్టారని ఆ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుంది.
ఇక జగన్ ముందు నుంచి కమ్మ వర్గాన్ని బాగా టార్గెట్గా చేసుకుంటూ వస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే తాజా ఎన్నికలలో కమ్మ సమస్య వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు టిడిపి నుంచి వైసీపీ చెంత చేరిన మరో ఇద్దరు కమ్మ ఎమ్మెల్యేలు మొత్తం 8 మంది వైసీపీ వైసీపీకి అనుకూలంగా ఓటు వేయడం విశేషం. కమ్మ ఎమ్మెల్యేలలో గుడివాడ నుంచి కొడాలి నాని – గన్నవరం నుంచి వల్లభనేని వంశీ – దెందులూరు నుంచి అబ్బయ్య చౌదరి – మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ – పెదకూరపాడు నుంచి నంబూరు శంకరరావు – వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు – తెనాలి అన్నాబత్తుని శివకుమార్ – చీరాల నుంచి కరణం బలరాం ఉన్నారు.
ఈ ఎనిమిది మంది కమ్మ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదు. తమకు సీటు ఇచ్చినందుకు, ప్రాధాన్యత ఇస్తున్నారని నమ్మకంతో ఉన్నారు. అయితే జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తోన్న ఆయన సొంత సామాజిక వర్గం వాళ్లే గట్టి దెబ్బకొట్టారు. ఇదే విషయాన్ని జగన్ తన సన్నిహితులతో జరిగిన చర్చల్లో ప్రస్తావించి వాపోయినట్టు టాక్ ?