సీనియర్ రాజకీయ నేత నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి దాదాపు దూరమైనట్టే. జగన్ ఆయనకు పొమ్మనకుండా పొగ పెట్టేశారు. ఆనం పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ప్రభుత్వంలో లోపాలు ఎత్తిచూపడంతో జగన్ ఆయను వ్యూహాత్మకంగా పక్కన పెట్టేశారు. వెంకటగిరి నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు.
వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా రాంకుమార్ రెడ్డి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. ఇక వైసిపి నేతలు కూడా ఆనంను పట్టించుకోవడం మానేశారు. ఆయన ఎమ్మెల్యేగా సిఫార్సు చేసిన పనుల బిల్లులను కూడా పక్కన పెట్టేశారు. ఆనం వైసీపీకి రాజీనామా చేయడం ఒక్కటే మిగిలి ఉంది. ఇక తాజాగా శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభలో ఆసక్తికర సంఘటన జరిగింది.
వైసిపి ఎమ్మెల్యే ఆనం తెలుగుదేశం పార్టీ సభ్యుల పక్కన కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఆనం తెలుగుదేశం పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రచారానికి తోడుగానే పసుపు కండువాల పక్కనే ఆయన ప్రత్యక్షం అయ్యారు. జగన్ కూడా ఆనం ను లైట్ తీసుకున్నారు. వెంకటగిరిలో కేవలం తన పార్టీ వేవ్ లోనె ఆనం గెలిచారని జగన్ ఫీల్ అవుతున్నారు. ఆనంకు అంత సీన్ లేదని జగన్ భావిస్తున్నారు.
అయితే ఆనం చాలా కసితో రగులుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో వైసిపిని శాయశక్తులా దెబ్బకొట్టేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆనకు నెల్లూరు జిల్లాలో 35 సంవత్సరాలుగా బలమైన అనుచరగణం ఉంది. ఆయన బయటికి వస్తే వెంకటగిరి, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, గూడూరు నియోజకవర్గాల్లో వైసిపికి కచ్చితంగా మైనస్ అవుతుంది. ఈ ఐదు నియోజకవర్గాల్లో ఆనం ప్రభావం బలంగా పనిచేస్తే వైసిపికి బలమైన షాక్లు తప్పవు. ఇక ఆత్మకూరు నుంచి కుమార్తె కైవల్య రెడ్డి టిడిపి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.