ఏపీలో అధికార వైసీపీకి నెల్లూరు పెద్దారెడ్లు అదిరిపోయిన షాకులు ఇస్తున్నారు. ఈ షాకుల దెబ్బతో వైసిపి విలవిల్లాడుతున్న పరిస్థితి. నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు వైసిపి రెడ్డి ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీకి రెబల్గా మారిపోయారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఎప్పటికీ టీడిపికి మానసికంగా దగ్గరైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అదే నెల్లూరు పెద్దారెడ్డి అయినా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం టీడిపి అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ వేసినట్టు వైసిపి వర్గాలు ప్రాథమికంగా అంచనాకు వచ్చేసాయి.
చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వైసిపి పెద్దలతో టచ్ లో లేకుండా పోయారు.
ఇలా ఒక నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు వైసీపీకి ఇంత పెద్ద షాక్ ఇస్తారని ఎవరు ఊహించలేదు. గురువారం జరిగిన ఈ షాక్ తో వైసిపి అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ కీలక నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు అందరూ డీలాపడిపోయారు.
ఈ షాక్ నుంచి కోలుకోక ముందే శుక్రవారం వైసీపీకి మరో షాక్ తగిలింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు వైఎస్సార్ సేవా రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఈరోజు టీడిపి కండువా కప్పుకున్నారు. తన అన్న శ్రీధర్ రెడ్డి వైసిపి పై తిరుగుబాటు చేసినప్పటి నుంచి గిరిధర్ రెడ్డి కూడా ఆయనతోనే ఉంటూ వస్తున్నారు. తాజాగా ఈరోజు గిరిధర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడిపిలో చేరిపోయారు.
నిన్న టీడిపి అభ్యర్థి అనురాధ గెలిచారని ప్రకటించిన వెంటనే గిరిధర్ రెడ్డి నెల్లూరులోని తమ కార్యాలయం ముందు బాణసంచా కాల్చి మరి సంబరాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం టీడిపిలో చేరికను పురస్కరించుకొని నగరంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు, లోకేష్ ఫోటోలతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఇక గిరిధర్ రెడ్డి టీడిపి కండువా కప్పుకోవడంతో రేపో మాపో కోటంరెడ్డి కూడా సైకిల్ ఎక్కేయటానికి సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తోంది.