ఏపీలో టీడీపీ అంచనాలు నిజమవుతున్నాయా? ఆ పార్టీ పుంజుకోవడమే కాదు.. తిరిగి అధికారంలోకి రావడమే కాదు.. ఈ దఫా ఎవరూ ఊహించని విధంగా పడి లేస్తుందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా పొరుగు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారు.. ఖచ్చితంగా ఏపీలో టీడీపీ భారీ మెజారిటీ దక్కించుకుంటుందని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ ఎవరూ ఊహించని విధంగా కేవలం 23 సీట్లకే పరిమితం అయిపోయింది. దీంతో ఇక, పార్టీ పరిస్థితి అయిపోయిందనే అంచనాలు వచ్చాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు.. ఇలానే ప్రచారం చేశారు. ఇంకేముంది.. టీడీపీ పరిస్థితి అయిపోయిందని.. ఇక, ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు దీనికి భిన్నంగా టీడీపీ పుంజుకుందనే వార్తలు వస్తున్నాయి. ఎక్కడ ఏ నలుగురు కలిసినా.. టీడీపీ గురించిన చర్చ జోరుగా సాగుతోంది.
పార్టీపై సానుకూల పవనాలు వీస్తున్నాయని చెబుతున్నా రు. గత ఎన్నికల్లో 23 స్థానాలు తెచ్చుకున్న టీడీపీ ఈ దఫా ఖచ్చితంగా 125 -160 స్థానాల్లో విజయం దక్కించుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా టీడీపీ పవనాలు జోరుగా వీస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. సమాజం లో మేధావి వర్గాలు.. చదువుకున్న వారు.. టీడీపీవైపు మళ్లుతున్నారని అంటున్నారు.
అదే సమయంలో ఉద్యోగులు కూడా.. వైసీపీకి దూరంగా ఉన్నారు. ఇది పరోక్షంగా టీడీపీకి మేలు చేస్తుందని.. సైలెంట్ ఓటింగ్ ఖచ్చితంగా జరుగుతుందని.. ఈ ఓటింగ్ టీడీపీకి కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు. మహిళలు, వృద్ధులు ఒకింత వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ.. వారిని మార్చేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు ఈ సారి టీడీపీ వైపు మళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరిగిన ధరలు కావొచ్చు.. పన్నుల బాదుడు కావొచ్చు. ఎలా చూసుకున్నా.. ఖచ్చితంగా ఈ సారి టీడీపీ విజయం దక్కించుకుంటుందని ఎక్కువమంది అభిప్రాయ పడుతున్నారు.
అంతేకాదు.. జిల్లాల వారీగా అంచనాలు వేస్తున్నవారు కూడా.. 125 నుంచి 160 స్థానాల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక, టీడీపీ వ్యక్తిగతంగా పెట్టుకున్న లక్ష్యం కూడా ఇదే కావడం గమనార్హం. ఇలా గెలుపు గుర్రం ఎక్కితే.. పొత్తులు కూడా అవసరం లేదనే వాదన పార్టీలో వినిపిస్తుండడం గమనార్హం.