ఏపీలో గత సాధారణ ఎన్నికలలో వైసిపి ఏకంగా 151 సీట్లలో అప్రతిహత విజయం సాధించి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఏపీలో ఉన్న 13 ఉమ్మడి జిల్లాలలో ఏకంగా నాలుగు జిల్లాలలో టిడిపి అసలు ఖాతా ఓపెన్ చేయలేదు. రాయలసీమలోని కడప, కర్నూలు తో పాటు నెల్లూరు, విజయనగరం జిల్లాలలో ఉన్న అన్ని సీట్లలో వైసీపీ తిరిగిలేని విక్టరీ కొట్టింది.
ఇక నెల్లూరు జిల్లాలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి తిరుగులేదు. కడప తర్వాత వైసీపీ చాలా బలంగా ఉన్న జిల్లా నెల్లూరు అని చెప్పాలి. వైసీపీ ఆవిర్భవించాక ఉదయగిరి, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల తో పాటు నెల్లూరు లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసిపి భారీ మెజార్టీతో విజయం సాధించింది.
అలాంటి నెల్లూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ కేవలం రెండు సీట్లకే పరిమితమవుతుందన్న ఊహాగానాలు జిల్లాలో బలంగా వచ్చేశాయి. ఒక్క సర్వేపల్లి, సూళ్లూరుపేట మినహా మిగిలిన 8 సీట్లలో సైకిల్ తిరుగులేకుండా దూసుకుపోతోందంటున్నారు. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం టీడీపీ అభ్యర్థులుగా పోటీలో ఉంటారని తెలుస్తోంది. ఇక కావలి, నెల్లూరు సిటీ, గూడూరు లాంటి చోట్ల వైసీపీ అభ్యర్థులపై వ్యతిరేకత ఉంది.
ఉన్నంతలో కోవూరులో ప్రసన్నకుమార్ రెడ్డి పర్వాలేదన్నట్టుగా ఉన్నా అక్కడ పార్టీ, ప్రభుత్వంపై వ్యతిరేకత ఆయనకు మైనస్ కానుంది. ఉదయగిరి, వెంకటగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు ఈ సారి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏదేమైనా గత ఆరేడు నెలల్లో ఒక్కసారిగా జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో పాటు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు పూర్తిగా రివర్స్ అవుతున్నాయి.