టిడిపి యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి దూసుకు వెళుతున్నారు. రోజురోజుకు యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక గత ఎన్నికలలో మంత్రిగా ఉండి మంగళగిరిలో పోటీ చేసి ఓడిన లోకేష్.. వచ్చే ఎన్నికలలోను మరోసారి అక్కడి నుంచి పోటీకి దిగుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం టిడిపికి అంత సురక్షితం కాదని… చాలామంది చెప్పినా గత ఎన్నికలలో పోటీ చేసి కేవలం 5000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.
ఇక ఎక్కడ పోగొట్టుకున్నారో.. అక్కడే గెలిచి తీరాలి అన్న చందంగా లోకేష్ ఈసారి మరింత కసితో మంగళగిరి బరిలోకి దిగబోతున్నారు. గత ఎన్నికలలో లోకేష్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికలలోనూ ఆళ్ళ అక్కడి నుంచి పోటీచేసి టిడిపి అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. లోకేష్ గత ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని అస్సలు వదిలిపెట్టలేదు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. తాను మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది అని.. అయినా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు వైసిపి మాటలు నమ్మి ఓట్లు వేశారని.. ఈసారి మంగళగిరి నియోజకవర్గ ప్రజలలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్న ధీమా లోకేష్లో బలంగా కనిపిస్తోంది. లోకేష్ ఓడిపోయినా ఏనాడు మంగళగిరిని వదిలిపెట్టలేదు. ఎప్పటికప్పుడు పార్టీలకు, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల సాధక బాధకాలను తీరుస్తున్నారు.
తాను ఎమ్మెల్సీగా ఉండి తన నిధులతో పాటు.. సొంత నిధులతో కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి ఆళ్ల పోటీ చేస్తే లోకేష్ కు పోటీ ఇచ్చే పరిస్థితి లేదన్న నివేదికలు ఇప్పటికే సీఎం జగన్ దగ్గరికి చేరాయి. ఈ క్రమంలోనే ఈసారి అక్కడ రకరకాల ఈక్వేషన్లలో మరో అభ్యర్తిని రంగంలోకి దింపి.. ఆళ్ల నియోజకవర్గం మార్చాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరికి బదులుగా సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారని.. ప్రస్తుతం అక్కడ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు బాపట్ల జిల్లాలోని రేపల్లె నుంచి పోటీ చేయటం లేదా పోటీ నుంచి విరమించుకోవడం జరుగుతుందని కూడా వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఆళ్ల ఇప్పటికే మంగళగిరిలో రెండుసార్లు గెలిచారు. గత ఎన్నికలలో లోకేష్ను ఓడిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ స్వయంగా హామీ ఇచ్చినా నెరవేరలేదు. దీనికి తోడు రాజధాని వికేంద్రీకరణ ప్రభావం ఈసారి మంగళగిరి నియోజకవర్గ ప్రజలలో బలంగా ఉంది. ఈసారి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుపు కష్టమే అన్న అభిప్రాయాలు ఆ పార్టీ వర్గాలలోనే వినిపిస్తున్నాయి. ఈసారి ఆళ్ల కంటే సామాజిక సమీకరణలతో పాటు కొత్త అభ్యర్థికి చోటు ఇవ్వాలని జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆళ్ళ అయితే ఈసారి మంగళగిరిలో పోటీ చేయటం లేదన్నది దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే. ఇక వైసిపి నుంచి పోటీ చేసేందుకు ఒక మాజీ ఎమ్మెల్యేతో పాటు.. ఆ పార్టీ నుంచి మరో ఇద్దరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి.