ఏపీలో అధికార వైసిపి అరాచక పాలన సాగిస్తోందన్న విమర్శలు ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. అసలు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిపక్షాలు చాలా చోట్ల తమ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులను కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. కొన్ని నియోజకవర్గాలలో అధికార పార్టీ నేతలు అంత భయంకరంగా వ్యవహరించారు. అంత ఎందుకు ఇటీవల టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తన కుటుంబంతో సహా కలిసినప్పుడు ఏపీలో జరుగుతున్న అరాచక పాలన గురించి మోడీకి చెప్పే ప్రయత్నం చేశారు.
వెంటనే మోడీ కనకమేడలతో ఏపీలో ఏం జరుగుతుందో ? ఎప్పటికప్పుడు నాకు తెలుసు. అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయని.. అరాచక పాలన నడుస్తుందని మోడీ కూడా అన్నట్టు కనకమేడల చెప్పిన సంగతి తెలిసిందే. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేతలు కూడా ఎప్పటికప్పుడు ఏపీలో పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శలు చేస్తున్నారు.
తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజంగానే ఇక్కడ అరాచక పాలన కొనసాగుతుందా ?అనేలా ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వినుకొండలో జరిగిన ఓ సమావేశంలో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికలాంటివి గతంలో మీరు చూసి ఉండరు.. చూడబోరులు అలా చేస్తా.. అన్నిటికీ సిద్ధంగా ఉన్నా బతికి ఉంటే నేనే గెలవాలి.. లేకుంటే నా బాధ్యత కాదు అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి.
మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో బ్రహ్మనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు నన్ను తక్కువగా ఊహించుకుంటే.. సమయం వచ్చినప్పుడు నేనేంటో చూస్తారు.. ఈసారి నాపై పోటీ చేయాలంటేనే భయపడేంతగా ఎలక్షన్ చేస్తా.. ప్రాణం వదలటానికి సైతం నేను సిద్ధంగా ఉన్నా అన్నారు. నా జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలని అనుకున్నా.. అయితే ఇప్పుడు ప్రజలతో దృఢమైన బంధం ఏర్పడింది.. వదిలి వెళ్ళటానికి నా మనసు అంగీకరించడం లేదని బ్రహ్మనాయుడు మాట్లాడారు.
నేను ముందుంటా మీరు నా వెంట ఉంటే చాలు అని బొల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసాయి. ఇక వచ్చే ఎన్నికలలో తాను 40 వేల నుంచి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందుతానని కూడా జోస్యం చెప్పారు. అసలు బొల్లా వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి ? ఆయన టిడిపి నేతలను బెదిరిస్తున్నారా ? లేదా ప్రజలను బెదిరిస్తున్నారా ? ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయన్న విమర్శలు అయితే సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.