ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత 15 రోజుల వ్యవధిలో ఏకంగా రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలను కలిసి వచ్చారు. జగన్ ఇంత తక్కువ వ్యవధిలో రెండుసార్లు ఎందుకు ? ఢిల్లీకి వెళ్లారు అన్నదానిపై రాజకీయ వర్గాలలోను, ఇటు వైసిపి వర్గాలలోను పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. టీడిపి వాళ్ళు అయితే జగన్ కేవలం తన సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయకుండా ఉండేందుకు.. ఈ అరెస్టును అడ్డుకునేందుకే ఢిల్లీకి వెళ్లారని విమర్శలు చేస్తున్నారు.
ఇటు వైసిపి నేతలు మాత్రం రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో కేంద్రంతో చర్చించేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వైసిపి నేతల మధ్య అంతర్గతంగా నడుస్తున్న చర్చల ప్రకారం ఏపీలో ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జగన్ అంచనాల ప్రకారం వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో మంచి సానుకూల వాతావరణం ఉంది.
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి, పార్టీకి చెందిన ఎమ్మెల్యేల తిరుగుబావుటా ఎగరవేయడం ఇవన్నీ ఆయనను కొద్దికొద్దిగా కలవర పెడుతున్న మాట వాస్తవం. ఇదే పద్ధతి ఎన్నికల వరకు కొనసాగితే పార్టీలో మరింతమంది అసంతృతవాదులు తయారవుతారని వచ్చే ఎన్నికల ముందు అది పార్టీకి ఇబ్బందిగా మారుతుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటు సొంత పార్టీలో అసమ్మతివాదులకు .. అటు ప్రతిపక్షాలకు ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
మే లేదా జూన్ నెలలో ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తారని సెప్టెంబర్, అక్టోబర్ లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని పుకార్లు అయితే మొదలయ్యాయి. ముందస్తు ఎన్నికలకు వెళితే మరోసారి విజయం సాధించవచ్చని.. అదే వచ్చే మే వరకు ఆగితే ఈ లోపు ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరుగుతుందని. ప్రతిపక్షాలకు మరింత ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. సెప్టెంబర్ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ మూడు రాష్ట్రాలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేలా జగన్ వ్యుహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఈనెల మూడో తేదీన స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా వైసిపి వర్గాల్లో చర్చి నడుస్తోంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే నేపథ్యంలోనే 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో చర్చించారని తెలుస్తోంది. ఏది ఏమైనా ముందస్తు ఎన్నికల వాతావరణంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.