గత ఎన్నికల్లో జగన్ గాలిలో సీనియర్లు, జూనియర్లు టిడిపి నుంచి పోటీ చేసిన చాలామంది ఓటమి బాటపట్టారు. ఇదే క్రమంలో తొలిసారి ఎన్నికల బరిలో దిగిన చాలామంది నేతల వారసులు సైతం ఓడిపోయారు. ఏ ఒక్క వారసుడు సైతం విజయం దక్కించుకోలేదు. దాదాపు టిడిపి నుంచి పోటీ చేసిన వారసులు ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు వారు పుంజుకుంటున్నారు. ఈ సారి వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఆ వారసులు ముందుకెళుతున్నారు.
ఇప్పటికే కొందరు వారసులు ఆధిక్యంలోకి వచ్చి తొలి విజయం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో దివంగత కాగిత వెంకట్రావు తనయుడు కాగిత కృష్ణప్రసాద్ విజయం దిశగా దూసుకెళుతున్నారు. గత ఎన్నికల్లో కాగిత అనారోగ్యం వల్ల పోటీ నుంచి తప్పుకుని తన తనయుడు కృష్ణప్రసాద్ని బరిలో దింపారు. అయితే వైసీపీ నుంచి పోటీ చేసిన జోగి రమేష్ 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఇక అక్కడ జనసేనకు 18 వేల ఓట్లు వరకు పడ్డాయి..అంటే జనసేన ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ గెలవడం, టిడిపి ఓడిపోవడం జరిగింది. ఈ సారి మాత్రం ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఇప్పటికే మంత్రి జోగిపై పెడనలో వ్యతిరేకత ఓ రేంజ్ లో కనిపిస్తుంది. పైగా నెక్స్ట్ ఆయనకు పెడన సీటు ఇవ్వరని ప్రచారం వస్తుంది. సీనియర్ నేత ఉప్పాల రామప్రసాద్ తనయుడు ఉప్పాల రాముకు పెడన సీటు ఇస్తారనే ప్రచారం ఉంది.
జోగి రమేష్ మైలవరం లేదా కైకలూరు నుంచి పోటీ చేయవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసినా పెడనలో కాగిత వారసుడుకు ప్రజా మద్ధతు ఈ సారి బలంగా కనిపిస్తుంది. ఈ సారి పొత్తు లేకపోయినా కాగిత తనయుడుకు పెద్ద నష్టం ఉండే ఛాన్స్ లేదు. ఒకవేళ పొత్తు ఉంటే కాగిత తనయుడు భారీ మెజారిటీతో పెడనలో తొలి విజయం దక్కించుకోవడం ఖాయం.