ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేయబోతున్నారని ప్రచారం జోరుగా నడుస్తోంది. పేర్ని నాని లాంటివాళ్ళు క్యాబినెట్లో మార్పులు ఉండవని చెప్తున్నా.. వైసిపి నేతల మధ్య జరుగుతున్న చర్చల ప్రకారం కచ్చితంగా క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని.. కొత్తగా కొందరు క్యాబినెట్ లోకి వస్తే.. ప్రస్తుతం ఉన్న మంత్రులలో కొందరు పదవులు ఊస్టింగ్ అవుతాయని గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉన్నాయి.
ఎన్నికలకు ముందు ఇలా మార్పులు, చేర్పులు చేయడం అంటే కచ్చితంగా మన ఇంటికి నిప్పు పెట్టుకోవటమే అన్న ఆందోళన వైసిపి సీనియర్లలో వ్యక్తం అవుతుంది. ఇప్పటికే పార్టీలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది ఉన్నారు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంకా చెప్పాలంటే.. 2004లో పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి.. ఎన్నో పోరాటాలు చేసి జగన్కు అండగా ఉన్నవారికి ఎలాంటి పదవులు లేవు.
2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి.. 2019 ఎన్నికలలో ఇతర పార్టీలలో ఓడి లేదా గెలిచి ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. దీంతో సీనియర్ నేతలు అందరూ రగిలిపోతున్నారు. కోటంరెడ్డి లాంటి జగన్ భక్తుడు పార్టీలో ఇమడలేక బయటకు రావడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ఇప్పటివరకు జగన్ ఎమ్మెల్యే లను తన కనుసైగలతో కంట్రోల్ చేస్తూ వచ్చారు.
అయితే ఇప్పుడు జగన్ భయపెట్టినా.. బతిమిలాడినా ఎమ్మెల్యేలు వినే పరిస్థితి లేదు. మరో ఏడాది పదవీకాలం ఉండగానే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ లైను ధిక్కరించి మరి వ్యతిరేకంగా ఓటు వేశారంటే అది మామూలే విషయం కాదు. పార్టీపై జగన్కు పూర్తిస్థాయిలో పట్టు ఉంది. పైగా రాష్ట్రంలో కింది నుంచి పై వరకు అంతా వైసిపి వాళ్లే అధికారంలో ఉన్నారు. ఇలాంటి టైంలో నలుగురు ఎమ్మెల్యేలు తెగించి మరి జగన్ను ధిక్కరించటం పెద్ద సాహసం అని చెప్పాలి.
ఒకవేళ జగన్ క్యాబినెట్లో మార్పులు చేస్తే మంత్రి పదవులు ఊడిన నేతలు.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు నేతలలో మరికొందరు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చలు ఉన్నాయి. అలాగే జగన్ కేబినెట్ తేనెతుట్టెను కదిపితే సాధారణ ఎన్నికలకు ముందు పార్టీలో పెద్ద అల్లకల్లోలానికి కారణం అవుతుందన్న గుసగుసలు ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి.