మీటూ ఉద్యమ దెబ్బతో ఇప్పటకీ ఎవరో ఒకరు తమకు ఎదురైన వేధింపుల గురించి ఓపెన్గానే చెపుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి ఎలాంటి బిడియం లేకుండానే ఓపెన్ అప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మనందరికి తెలిసిన ఓ బాలీవుడ్ నటి కూడా ఇప్పుడు తాను ఓ అగ్ర నిర్మాత నుంచి ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పింది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ నటి, హిందీ టీవీ పరిశ్రమలో పాపులర్ నటి అయిన అంకితా లోఖండే. అంకితా ఎవరో కాదు ప్రముఖ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మొదటి గాళ్ ఫ్రెండ్. అంకితా లోఖండే 2009 – 2014 మధ్య కాలంలో జీ టీవీలో ఐదు సంవత్సరాలకు పైగా బాగా పాపులర్ అయిన టెలివిజన్ షో ‘పవిత్ర రిష్ట’తో ఎంతో పేరు తెచ్చుకుంది.
ఈ షోలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానవ్ దేశ్ ముఖ్ పాత్రను పోషించగా.. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహంతో పాటు ప్రేమ బలపడింది. ఆమె బుల్లితెర నుంచి వెండితెరపై పాపులర్ అయ్యేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు వేధింపుల బాధలు తప్పలేదట. ఈ క్రమంలోనే తాను ఎదుర్కొన్న రెండు షాకింగ్ సంఘటనలను అంకిత రివీల్ చేసింది.
అంకిత చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఓ సౌత్ సినిమాలో నటించాలన్న ఆఫర్ వచ్చిందట. అయితే మేనేజర్ ఆమెను గదిలోకి పిలిచి నువ్వు కాంప్రమైజ్ కావాలని చెప్పాడట. వెంటనే అంకిత మీ నిర్మాతతో నేను పార్టీలు, విందులకు వెళ్లాలా ? అని అడిగేసిందట. అయితే వెంటనే మేనేజర్ నువ్వు నిర్మాతతో పడుకోవాలని చెప్పేశాడట. ఆ మాట విన్న వెంటనే తాను ఈ సినిమాలో చేయలేను అని చెప్పి వచ్చేశానని తెలిపింది.
ఇక తన జీవితంలో రెండో సంఘటన విషయానికి వస్తే ఓ పెద్ద నటుడు నా చేతులు పట్టుకున్నాడు. వెంటనే నాలో టెన్షన్ స్టార్ట్ అయ్యిందని.. తాను అతడిని వదిలించుకుని వచ్చేశానని చెప్పింది. ఇలాంటి పనులు చేసి అవకాశాలు దక్కించుకోవడం నా వల్ల కాదని అంకిత కుండబద్దలు కొట్టేసింది. ఇక అంకిత కంగనా రనౌత్ నటించిన 2019 హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.