ఏపీలో అధికార వైసిపికి అదిరిపోయే షాక్ తగలనుంది. వచ్చే సాధారణ ఎన్నికలు జగన్ కు చావో, రేవులా మారాయి. ఎలాగైనా 2024 ఎన్నికలలో విజయం సాధించి మరో ఐదు ఏళ్ల పాటు తిరుగులేని అధికారాన్ని అనుభవించాలని జగన్ కసితో రగులుతున్నారు. పక్క ప్రణాళికతో ముందుకు వెళుతున్న పరిస్థితి.
ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 60 నుంచి 70 మందికి టికెట్లు లేవని చెబుతున్నారు. ఇలాంటి టైంలో కొందరు సీనియర్ నేతలు వచ్చే ఎన్నికలలో తాము పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు టికెట్లు ఇప్పించుకోవాలని పట్టుబడుతున్నారు.
ఈసారి తమ వారసులను రంగంలోకి దించకపోతే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని.. ఎలాగైనా వారికి ఈసారి టిక్కెట్ ఇప్పించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇలాంటి వారిలో ధర్మాన ప్రసాదరావు, పేర్ని నాని ఇలా చాలామంది నేతలు ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగన్ కు అండగా ఉంటూ వస్తున్నారు.
నిజం చెప్పాలంటే జగన్ కు ఆయన రైట్ హ్యాండ్ గా ఉంటున్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి లాంటి బలమైన నేతలు ఉన్నా కూడా జగన్ చెవిరెడ్డికి బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఒకేసారి మూడు నాలుగు పదవులు చెవిరెడ్డికి వచ్చాయంటే జగన్ ఆయనను ఎంతలా ? నమ్ముతున్నారో తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో తన పెద్ద కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చంద్రగిరి నుంచి పోటీ చేయించాలని గత కొంతకాలంగా చెవిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే జగన్ మాత్రం అన్న వచ్చే ఎన్నికలు మనకు చాలా కీలకం… నువ్వే పోటీ చేయాలని చెవిరెడ్డికి చాలాసార్లు సూచించారు. ఎట్టకేలకు చెవిరెడ్డి పంతం పట్టడంతో చివరకు జగన్ మోహిత్ రెడ్డి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో తండ్రికి తోడుగా మోహిత్ రెడ్డి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తిరుపతి రూరల్ ఎంపీపీగా కూడా కొనసాగుతున్నారు. చెవిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇక తన రాజకీయ వారసత్వాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని నియోజకవర్గంలో బలంగా విస్తరించాలన్న కోరికతోనే తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడిని రాజకీయ రణక్షేత్రంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నికలకు ఏడాది ముందుగానే తన పెద్ద కుమారుడికి టిక్కెట్ ఖరారు చేయించుకోవడం అంటే చెవిరెడ్డి మామూలు నేత కాదని చెప్పాలి.