ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకునే లక్షలాది మంది కార్యకర్తలు గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ చిత్తుచిత్తుగా ఓడిపోవాలని కూడా అంతే కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిద్దరూ వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ గడప తొక్కకూడదని రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. వీరిద్దరు చంద్రబాబు, లోకేష్ తో పాటు.. బాబు కుటుంబం పై చేసిన తీవ్రమైన విమర్శలు.. వాడిన దారుణమైన పదజాలం ప్రతి ఒక్క కార్యకర్తను ఎంతో బాధ పెట్టింది.
ఇక గుడివాడలో నాని వరుసగా నాలుగు సార్లు విజయాలు సాధిస్తున్నారు. తొలి రెండుసార్లు తెలుగుదేశం నుంచి గెలిచిన ఆయన 2014, 2019 ఎన్నికలలో వైసిపి నుంచి ఘనవిజయాలు సాధిస్తున్నారు. 2014 ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ని తీసుకువచ్చి సీటు ఇస్తే ఆయన ఓడిపోయారు. ఇక గత ఎన్నికలలో విజయవాడకు చెందిన యువనేత దేవినేని అవినాష్ ను రంగంలోకి దింపినా పని అవ్వలేదు. ఇక ఎన్నికలలో ఓడిన అవినాష్ వెంటనే వైసిపిలోకి జంప్ చేసేసారు. వచ్చే ఎన్నికలలో నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు గుడివాడ సీటును చాలా సీరియస్గా తీసుకున్నారు.
నందమూరి వారసుడు తారకరత్న పేరు బలంగా వినిపించింది. తారకరత్న కూడా తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించడంతో అందరూ ఆయన పోటీ చేసేది గుడివాడే అనుకున్నారు. అయితే తారకరత్న హఠాన్మరణంతో ఇప్పుడు మళ్లీ అక్కడ బలమైన అభ్యర్థినే వెతకాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడింది. ఈ క్రమంలోనే గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ వెనిగళ్ళ రామును రంగంలోకి దింపాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత కొన్ని ఏళ్లలో గుడివాడలో టీడిపికి అండగా ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు.
అయితే నానిని ఓడించాలంటే రావి వల్ల కాదన్న సందేహాలు టీడిపి వర్గాల్లోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కమ్మ + దళిత కాంబినేషన్ కలిసి వస్తుందని.. అందుకే వెనిగళ్ళ రాము అభ్యర్థిత్వం పై చంద్రబాబు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. రాము భార్య దళితురాలు.. పైగా క్రిస్టియన్. ఆమె గత కొంతకాలంగా గుడివాడ నియోజకవర్గంలో సామాజిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆమెకు చర్చికి వెళ్లే క్రిస్టియన్లలో మంచి గుర్తింపు ఉందని తెలుస్తోంది. ఇక వెనిగళ్ళ రాముకు కమ్మసామాజిక వర్గం మద్దతు ఎలాగూ ఉంటుంది. ఇక టీడిపి అభిమానులు కూడా ఉంటారు.