ఈ సారి ఎన్నికల్లో టిడిపి ప్రభంజనం సృష్టించేలా ఉంది. 1994, 99 సమయంలో ఎలాంటి విజయాలని నమోదు చేసిందో.. ఆ తరహాలో టిడిపి సత్తా చాటడం ఖాయమనే పరిస్తితి కనిపిస్తుంది. అధికార వైసీపీపై తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టిడిపి ఈ సారి సంచలన విజయాలని సొంతం చేసుకునేలా ఉంది. చాలా ఏళ్లుగా గెలుపుకు దూరమైన స్థానాల్లో కూడా టిడిపి ప్రభంజనం కొనసాగేలా ఉంది.
అలా కర్నూలు పార్లమెంట్ సీటులో టిడిపి హవా నడిచేలా ఉంది. ఈ సీటుని టిడిపి గెలుచుకుని 25 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో అక్కడ్ టిడిపి గెలిచింది. అంతకముందు 1984 ఎన్నికల్లో గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ ఎప్పుడు అక్కడ గెలవలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది. అయితే 2014లో కాస్త టిడిపికి అవకాశం వచ్చింది గాని..వైసీపీకి కాస్త బలం ఎక్కువ ఉండటం వల్ల 44 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది.
ఆ తర్వాత వైసీపీ నుంచి గెలిచిన ఎంపీ బుట్టా రేణుకని టిడిపిలోకి తీసుకున్నారు. అయినా సరే టిడిపికి ఉపయోగం లేదు. 2019 ఎన్నికల ముందు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని ఎంపీగా నిలబెట్టారు. కానీ లక్షా 48 వేల ఓట్ల మెజారిటీతో టిడిపి ఓడిపోయింది. అయితే అప్పుడు వైసీపీ గాలి ఉంది. ఇప్పుడు అది లేదు..టిడిపి బలపడుతుంది. కోట్ల బలం పెంచుకున్నారు.
అటు కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో టిడిపి సత్తా చాటేలా ఉంది. పార్లమెంట్ పరిధిలో కర్నూలు సిటీ, కోడుమూరు, ఆలూరు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు సీట్లు ఉన్నాయి. ఒకటి, రెండు స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో టిడిపి బలం పెంచుకుంది. దాదాపు 5 స్థానాల్లో టిడిపికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటు టిడిపి ఖాతాలో పడేలా ఉంది. మొత్తానికి కర్నూలు కోటపై పసుపు జెండా ఎగిరేలా ఉంది.