పల్నాడు టీడీపీలో కొత్త ఊపు వచ్చింది. గత నాలుగేళ్లలో తన నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ పోతోన్న మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు కొమ్మాలపాటి తాజాగా సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వంలో తన విశ్వరూపం చూపించారు. శ్రీధర్ దూకుడు కారణంగా గుంటూరు జిల్లాలోనే నూతనోత్తేజం కనిపిస్తోంది. పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు.. కనుసన్నల్లో అవినీతి జరుగుతోందని.. కృష్ణానది ఇసుకను దోచేస్తున్నారని.. కొన్నాళ్లుగా కొమ్మాలపాటి ఉద్యమిస్తున్నారు.
నదిలో అక్రమ తవ్వకాలు వల్ల నదిలోకి ఈతకు వెళ్లిన పిల్లలు కూడా మృతిచెందుతున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అక్రమ ఇసుక తవ్వకాలను కొమ్మాలపాటి గత కొద్ది రోజులుగా ఎండగడుతూ వస్తున్నారు. దీంతో స్థానికంగా కొమ్మాలపాటికి మద్దతు ఓ రేంజ్లో పెరిగింది. ఇసుక అవినీతికి పాల్పడుతూ.. కోట్లరూపాయలు దోచుకుంటున్నారని.. నంబూరిపై కొమ్మాలపాటి విమర్శ లు చేశారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి.
ఇసుక తవ్వకాలు, నియోజకవర్గ అభివృద్ధిపై.. అమరేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేద్దామంటూ ఇరువర్గాలు సవాళ్లు విసురుకున్నాయి. దీంతో అమరావతిలో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ముఖ్యంగా కొమ్మాలపాటికి మద్దతుగా భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు మోహరించాయి. అయితే.. పోలీసులు రంగంలోకి దిగి.. టీడీపీ వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొందరు నేతలను గృహ నిర్బంధం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఉద్రిక్తతల మధ్యే ఎమ్మెల్యే నంబూరు.. అమరేశ్వర ఆలయానికి చేరుకున్నారు.
అయితే.. అప్పటికే కొమ్మాలపాటిని పోలీసులు అరెస్టు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొమ్మాలపాటికి మద్దతుగా వస్తోన్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు కొందరిపై లాఠీచార్జ్ కూడా చేశారు. అయినా తాను ఎక్కడా వెనక్కు తగ్గనని.. ఎలాంటి ప్రమాణం కావాలన్నా చేస్తానని కొమ్మాలపాటి చెప్పారు. అయితే, నంబూరు మాత్రం.. తాను సవాల్ విసిరినా.. ముందుగా.. టీడీపీ నేత కొమ్మాలపాటి ప్రమాణం చేస్తేనే చేస్తానని భీష్మించారు.
అరెస్టు చేసిన కొమ్మాలపాటిని పోలీసులు వాహనంలో తిప్పుతూ వేధింపులకు గురి చేశారని.. టీడీపీ నేతలు ఆరోపించారు. అదేవిధంగా పచ్చ చీర ధరించిన మహిళను కూడా అరెస్టు చేశారని.. పసుపు రంగు కనిపిస్తే చాలు అన్నట్టుగా పోలీసులు వ్యవహరించారని విమర్శించారు. అమరావతిలోప లువురు టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి క్రోసూరు స్టేషన్కు తరలించారు. ఆదివారం అమరావతి అంతా రణరంగంగా మారింది.
ఏదేమైనా కొమ్మలపాటి వైసీపీ ఎమ్మెల్యేపై సవాల్ చేయడంతో పాటు చొక్కా చింపి పోలీసులు అరెస్టు చేసినా ఎక్కడా వెనక్కు తగ్గకుండా పోరాడడం.. కొమ్మాలపాటి స్ఫూర్తితో పెదకూరపాడు టీడీపీ కలిసికట్టుగా ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయడం ఇప్పుడు పల్నాడు జిల్లాలోనే కాకుండా.. ఉమ్మడి గుంటూరు టీడీపీలోనే సరికొత్త జోష్ నింపింది.