ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన సొంత నియోజకవర్గంలో సత్తెనపల్లిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2014 ఎన్నికలలో సమైక్యాంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరాపై స్వల్ప తేడాతో ఓడిపోయిన అంబటి గత ఎన్నికలలో జగన్ వేవ్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడెప్పుడో 1989లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి తిరిగి 30 ఏళ్ల తర్వాత సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ గడప తొక్కారు. ప్రస్తుతం అంబటి మంత్రిగా ఉన్నా సత్తెనపల్లిలో సొంత పార్టీ నేతల నుంచి ఆయన తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
ఇక ఇప్పటికే అక్కడ జరిగిన రెండు మూడు సర్వేలలో అంబటికి వ్యతిరేకంగా నివేదికలు జగన్ వద్దకు చేరిపోయాయి. వచ్చే ఎన్నికలలో అంబటికి సత్తెనపల్లి సీటు ఇవరని.. ఆయనను బాపట్ల జిల్లాలోని రేపల్లె నుంచి పోటీ చేయించడం లేదా అసలు ? సీటు లేకుండా పక్కన పెట్టేస్తారని కూడా వైసిపి వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే సత్తెనపల్లిలో అంబటి సీటుకు ఇప్పుడు వైసీపీలోని ఇద్దరు రెడ్డి నేతలు ఎసరుపెట్టే ప్రయత్నాలు ప్రారంభించేశారు.
మంగళగిరిలో ఈసారి తాను గెలిచే పరిస్థితి లేదని డిసైడ్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి సత్తెనపల్లి వైపు దృష్టిసారిస్తున్నారు. మంగళగిరిలో గత రెండు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న ఆళ్లకు ఈసారి అక్కడ సానుకూల వాతావరణం లేదు. రాజధాని వికేంద్రీకరణతో పాటు.. లోకేష్ పై ఉన్న సానుభూతి ఈసారి లోకేష్ కు చాలా సానుకూలంగా ఉందని వైసిపి నివేదికల్లోనే తేలుతోంది. దీంతో ఆర్కే సత్తెనపల్లి వైపు దృష్టి పెడుతున్నారు.
ఇక తాజాగా సత్తెనపల్లికి చెందిన మరో రెడ్డి నేత, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికలలో తాను వైసీపీ నుంచి సత్తెనపల్లిలో పోటీ చేసి తీరుతానని బహిరంగంగా ప్రకటించుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైసిపి నేతలతో ఒక సమావేశం ఏర్పాటు చేయగా నియోజకవర్గ వ్యాప్తంగా అంబటిని వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలు అందరూ ఈ సమావేశానికి వెళ్లారు. అంబటి రాంబాబు తీరుతో పార్టీ ప్రతి గ్రామంలో రెండుగా చీలిపోయిందని అంబటి నాయకులు, కార్యకర్తలను అసలు పట్టించుకోవడంలేదని.. చిన్న పని కోసం వెళ్లినా నలుగురు కోటరీ నాయకులను కలిసి డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తుందని.. ఈ సమావేశానికి వచ్చిన వాళ్లంతా అంబటి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము కష్టపడటం వల్లే అంబటి ఎమ్మెల్యేగా గెలిచారని.. ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీ పునాదులు బలహీనం అవుతూ ఉంటే తాము చూస్తూ ఊరుకోమని విజయభాస్కర్ రెడ్డి ప్రకటించారు. సత్తెనపల్లి టికెట్ విషయంలో తాను యుద్ధానికి అయినా సిద్ధం అని చెప్పడాన్ని బట్టి చూస్తే అక్కడ ఆయన తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి వెళ్లకుండా చాలామంది వైసిపి నేతలను అంబటి రాంబాబు కట్టడి చేసినా… ఆయన మాటలు కూడా పట్టించుకోకుండా చాలామంది విజయభాస్కర్ రెడ్డి సమావేశానికి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా సత్తెనపల్లిలో ఇప్పుడు ఇద్దరు రెడ్డి నేతలు అంబటి సీటుకు ఎసరుపెట్టేలా అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.