ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చేసారా ? ఆయనను మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్టు ఇప్పటికే చెప్పేసారా ? అంటే వైసిపి వర్గాలలోను.. శ్రీకాకుళం జిల్లాలోను అవుననే చర్చ జరుగుతుంది. అప్పలరాజు జిల్లా పర్యటనలో ఉండగానే సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ నుంచి అర్జెంటుగా పిలుపు రావడంతో ఆయన తన కార్యక్రమాలు రద్దు చేసుకుని మరి తాడేపల్లి వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే మంత్రి పదవిపై అప్పలరాజు స్వయంగా వివరణ ఇవ్వడంతో అప్పుడే చాలామందికి అనుమానాలు వచ్చాయి.
మంత్రి అప్పలరాజు సామాజిక వర్గానికి చెందిన మత్స్యకార వర్గానికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చినప్పుడే ఆయనకు మంత్రి పదవిపై డౌట్ పట్టుకుంది. దీంతో మంత్రిగా తనను తప్పించి ఎవరికీ అవకాశం ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో పార్టీ సీనియర్ నేత.. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాంకు అప్పలరాజు స్థానంలో మంత్రి పదవి కట్టబెడతారని కూడా జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
జగన్ ను కలిసిన అనంతరం అప్పలరాజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా తాను బాధపడనని.. తనకు మంత్రి పదవి కన్నా ప్రజాసేవ ముఖ్యం అని చెప్పారు. బీసీ వర్గానికి చెందిన తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. జగన్ మంత్రి పదవి ఇచ్చారని అప్పలరాజు గుర్తు చేసుకున్నారు. సీదిరి ప్లేస్లో అదే జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాంకు మంత్రి పదవి ఇస్తున్నట్టు కూడా జగన్ నేరుగా చెప్పినట్టు కూడా టాక్ ?
ఇక జగన్ క్యాబినెట్లో కొత్తగా నలుగురికి మంత్రి పదవులు ఇస్తున్నారని.. ఈ క్రమంలోనే కొందరిని తప్పిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక పలాస నియోజకవర్గంలో అప్పలరాజు పనితీరుపై జగన్ అంత సంతృప్తిగా లేరని.. ఆయనకు వ్యతిరేకంగా నివేదికలు కూడా వెళ్లాయని అంటున్నారు. పలాసలో స్వపక్షంలోనే విపక్షం తయారయింది. పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి మంత్రిపై బహిరంగంగానే అసమ్మతి వెళ్ళగకుతున్నారు.
ఇప్పటికే చాలాసార్లు నియోజకవర్గంలో మంత్రికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశమై మంత్రి అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారు. మంత్రి చుట్టూ ఉన్న నలుగురు కోటరీ నేతల వల్లే సీదిరికి ఈ గతి పట్టిందని తెలుస్తోంది. ఇక మంత్రి అనుచరులపై భూ అక్రమణల ఆరోపణలు ఉన్నా ఆయన పట్టించుకోవడంలేదని.. దీంతో వాళ్లు రెచ్చిపోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.