ఎన్టీఆర్ సినిమాలు అంటేనే ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఇక, ఆయన తన కుమారుడితో కలిసి నటించిన సినిమా అంటే.. మరింత ప్రత్యేకం. అలాంటి చిత్రమే వేముల వాడ భీమకవి! ఇది చాలా ఓల్డ్ మూవీ. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహాకవి వేములవాడ భీమకవి. ఈయన కథను తెరకెక్కించాలని అన్నారు కంకణం కట్టుకున్నారు. కానీ, నిర్మాతలుఎవరూ ముందుకు రాలేదు. పక్కా కమర్షియల్ కాదు కనుక జంకారు. పైగా బాలయ్య పూర్తిస్థాయి నిడివి ఉన్న పాత్ర. దీంతో అన్నగారే.. అన్నీ అయి ఈ చిత్రాన్ని నిర్మించారు.
భీమకవి పాత్రను తన కుమారుడు బాలకృష్ణతో నటింపజేశారు ఎన్టిఆర్. ఇక, బాలకృష్ణ ఎన్టీఆర్ దర్శకత్వంలో ఏడు చిత్రాల్లో నటించారు. కొడుకును తన నటవారసునిగా పరిశ్రమలో నిలబెట్టాలని నిర్ణయించుకున్న రామారావు మొదట్లో బాలకృష్ణతో తీసిన చిత్రాల్లో హీరోగా కాకుండా ద్వితీయ ప్రాముఖ్య పాత్రలనిచ్చారు. ఆ తర్వాతే హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలని ‘వేములవాడ భీమకవి’ నిర్మించారు.
అందుకనే వాల్ పోస్టర్లలో కూడా ‘బాలకృష్ణ నటించిన’ అన్న ట్యాగ్ లైన్ ప్రముఖంగా ప్రింట్ చేయించారు. ఈ సినిమా బాలకృష్ణకు నిజంగా ఒక అగ్నిపరీక్షే! ఎన్.టి.రామారావు, రాజనాల, సత్యనారాయణ, షావుకారు జానకి, గిరిజ, విజయలలిత, కాంతారావు వంటి అగ్రశ్రేణి సీనియర్ నటీనటుల మధ్య ఆయనకు ఇది నాలుగవ చిత్రం. సింహం కడుపున సింహమే పుడుతుందన్నట్లు నెగ్గుకొచ్చి యీనాటికీ అన్నగారి వారసునిగా కొనసాగుతున్నారు బాలకృష్ణ.
దీనిలో ఎన్.టి.రామారావు కళింగ గంగు పాత్ర ధరించారు. ఎన్.టి.ఆర్ కథ, స్క్రీన్ప్లే సమకూర్చిన యీ చిత్రంలో ప్రజాస్వామ్యం గురించి, వినోదపు పన్ను గురించి చెప్పిన డైలాగులు ప్రజల్ని ఆలోచింపజేశాయి. బాలకృష్ణ నటన, కూచిపూడి నృత్య నాటకంలో ఎన్.టి.ఆర్ నర్తనం ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా.. లాభాలు పండించకపోయినా.. తండ్రీ కొడుకులు కలిసి నటించిన సినిమాల్లో మాత్రం నెంబర్ 1గా నిలిచిపోయింది. అంతేకాదు.. బాలకృష్ణకు అనేక పాఠాలు నేర్పిన సినిమా కూడా ఇదే కావడం గమనార్హం.