41 సంవత్సరాల తెలుగుదేశం ఇన్నేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. చాలాసార్లు పార్టీ పని అయిపోయింది.. ఇక తెలుగుదేశం మూసుకోవటమే అన్న విమర్శలు వచ్చాయి. ఇలాంటి ఎన్నో సవాళ్లను తట్టుకొని టీడిపి నాలుగు దశాబ్దాలుగా తన ప్రస్థానం కొనసాగిస్తూ వస్తోంది. 1989లో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు పార్టీ పని అయిపోయింది.. ఎన్టీఆర్ కి మళ్ళీ సినిమాలు చేసుకోవటమే అని జాతీయస్థాయిలో విమర్శలు వచ్చాయి. 1994లో ఎన్టీఆర్ కనివిని ఎరుగని భారీ మెజార్టీతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.
ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మూడుసార్లు పార్టీ పతనం అంచులకు వెళ్లి అనూహ్యంగా పుంజుకుంది. 2008 ఆగస్టులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నాటి సమైక్యాంధ్రలో ఉన్న 294 సీట్లలో టిడిపి 25 లోపు సీట్లలో మాత్రమే గెలుస్తుందన్న అంచనాలు వచ్చాయి. 2009 ఎన్నికలలో ప్రధాన పోటీ కాంగ్రెస్, ప్రజారాజ్యం మధ్య మాత్రమే ఉంటుందని చాలామంది అంచనా వేశారు.
అయితే అనూహ్యంగా 2009 ఎన్నికలలో టీడిపి ఏకంగా 92 స్థానాలలో విజయం సాధించింది. ఆ ఎన్నికలలో టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు లేకుండా ఉండి ఉంటే కచ్చితంగా చంద్రబాబు గెలిచి సీఎం అయ్యేవారు. 2012 జూన్ నాటికి నాటి సమైక్య రాష్ట్రంలో 294 సీట్లలో కేవలం 18 నుంచి 20 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. వైసిపి ప్రభంజనం.. అటు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ దూకుడు తట్టుకుని తెలుగుదేశం బతికి బట్ట కడుతుందని ఎవరు అనుకోలేదు.
అయితే 2014లో ఇటు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో పాటు.. అటు తెలంగాణలోనూ ఏకంగా 15 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది. ఇక 2019 మే ఎన్నికలలో ఏపీలో ఉన్న 175 సీట్లలో కేవలం 23 సీట్లకు పరిమితం అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ పార్టీ అనూహ్యంగా పుంజుకుని అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఇలా చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టాక 15 సంవత్సరాల లో మూడుసార్లు పతనం అంచులకు వెళ్లి మళ్లీ పుంజుకోవటం సామాన్యమైన విషయం కాదు. రేపటి ఎన్నికలలో కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ అయి చంద్రబాబు మరోసారి ఏపీ సీఎం అవుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.