అసలు నెల్లూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏ రోజు ఎప్పుడు ? ఎలా షాక్ తగులుతుందో తెలియక జగన్ కి మైండ్ బ్లాక్ అయిపోతోంది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గత ఏడాదిన్నర కాలంగా అసమ్మతిగళం వినిపిస్తున్నారు. అంతవరకు ఓకే.. అయితే నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు పెద్ద దెబ్బ కొట్టారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల రోజుల క్రిందటే పార్టీకి దూరం అయ్యారు. ఆ షాక్ నుంచి కోలుకోక ముందే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు అధిష్టానం డిక్లేర్ చేసింది.
ఆ వెంటనే ఆనం, కోటంరెడ్డితో పాటు చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి ఒకేసారి సస్పెండ్ చేసింది. పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలో ఒకేసారి ముగ్గురు.. అందులోను జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన రెడ్డి ఎమ్మెల్యేలను బహిష్కరించడం అంటే మామూలు విషయం కాదు. పార్టీలో ఏ స్థాయిలో ? అసమ్మతి పేరుకుపోయిందో ఇందుకు నిదర్శనం అని చెప్పాలి. ఇక ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోక ముందే.. నిన్నటి నుంచి కోవూరు ఎమ్మెల్యే అయినా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారని.. పార్టీలో ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాను ఎప్పటికీ జగన్ తోనే ఉంటానని సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. సరే ప్రసన్నకుమార్ రెడ్డి సంగతి కాసేపు పక్కన పెడితే.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారం అయితే జిల్లాలో బలంగా వినిపిస్తోంది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. 2009 ఎన్నికలలో కావలి నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన రామిరెడ్డి 2014 – 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీచేసి టిడిపికి చెందిన సీనియర్ నేత బీద మస్తాన్రావు పై వరుస విజయాలు సాధించారు.
గత ఎన్నికలలో ఓడిన మస్తాన్రావు వైసీపీ గూటికి చేరిపోయారు. ప్రస్తుతం ఆయన వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. ఇక జగన్ చేయించిన సర్వేలలో ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని.. ఈసారి ఇక్కడ కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్కు అత్యంత నమ్మకమైన నేతగా ఉంటూ వస్తున్నారు. ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డిని కావలి నుంచి వైసీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయించాలని గత ఏడాదికాలంగా ఆయన చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే అనూహ్యంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో ప్రశాంతి రెడ్డి పేరు ఉదయగిరి రేసులో కూడా వినిపించింది. అయితే ఉదయగిరికి కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి – కావ్య కృష్ణారెడ్డి – మెట్టుకూరు చిరంజీవి రెడ్డి లాంటి బలమైన నేతలు రేసులో ఉన్నారు. దీంతో ప్రశాంతి రెడ్డికి కావలి సీటు కచ్చితంగా దక్కుతుందన్న ప్రచారం అయితే జరుగుతుంది. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కని పక్షంలో ప్రతాపరెడ్డి పక్కచూపులు చూసే అవకాశం ఉందన్న లీకులు అయితే కావలిలో వినిపిస్తున్నాయి. పైగా కావలిలో టిడిపికి సరైన అభ్యర్థి కూడా లేరు. మరి నిజంగానే ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ మారతారా ?లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి పేరు మాత్రం కావలి వైసీపీ రేసులో గట్టిగా వినిపిస్తున్న మాట నిజం.