ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి కూడా గత రెండు రోజులుగా మీడియాలో వైసిపి గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెడుతున్నారు.
2019 ఎన్నికలలో డాక్టర్ వృత్తిలో ఉండి రాజకీయాల్లోకి వచ్చిన శ్రీదేవి తొలిసారి వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అమరావతి ప్రాంతం విస్తరించి ఉన్న తాడికొండలో ఆమె 4400 ఓట్ల మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆమెతోపాటు ఆమె భర్త శ్రీథర్ కూడా హైదరాబాదులో డాక్టర్ గా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది నుంచి రాజకీయంగా ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
తన నియోజకవర్గానికి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో పాటు.. టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, జడ్పీ చైర్మన్ హెన్రీ కత్తెర క్రిష్టియానా, ఆమె భర్త కత్తెర సురేష్ లాంటి నేతలు అందరూ తాడికొండ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. అటు సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి అంబటి రాంబాబు కూడా తాడికొండలో వెలుపెడుతుండడంతో శ్రీదేవికి చిర్రెత్తుకు వచ్చేసింది. ఇక శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉండగానే జగన్ ముందుగా డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఇన్చార్జి పగ్గాలు ఇచ్చారు. ఇప్పుడు జడ్పీ చైర్మన్ క్రిస్టియానా భర్త సురేష్ అదనపు సమన్వయకర్తగా ఉన్నారు.
ఇక వచ్చే ఎన్నికలలోను ఆమెకు సీటు లేదని అధిష్టానం నుంచి క్లారిటీ రావడంతో ఆమె ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే శ్రీదేవి మాత్రం ఇలాంటి ప్రచారం ఖండిస్తున్నారు. పార్టీ తనను సస్పెండ్ చేశాక తీవ్రంగా రెచ్చిపోతున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే తాను ఏ అన్యాయం చేయకపోయినా అనవసరంగా పార్టీ నుంచి బయటికి పంపించారని.. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ను చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తే సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఇక తమ పార్టీలో గంట, అరగంట అంటూ ఉంటారని పరోక్షంగా మంత్రి అంబటి రాంబాబుపై సెటైర్లు వేశారు.
అలాగే సోషల్ మీడియాలలో ప్రైవేట్ పార్టులు చూసుకునే ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి వాళ్లు ఉన్న వాళ్ళని మాత్రం ఏమీ చేయరని.. తనకు ఏ పాపం ? తెలియకపోయినా తనను మాత్రం అన్యాయంగా పార్టీ నుంచి బహిష్కరించారంటూ ఒక ఆటాడుకున్నారు. ఏదేమైనా శ్రీదేవి బయటకు వచ్చాక మాటల తూటలు పేలుస్తూ వైసిపిని ఆ పార్టీ అధిష్టానాన్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు.