ఉదయగిరి వైసిపి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఇక వచ్చే ఎన్నికలలో వైసిపి నుంచి కొత్త అభ్యర్థి రంగంలో ఉండనున్నారు. వైసిపి ఆవిర్భావం నుంచి ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే పోటీ చేస్తూ వస్తున్నారు. 2012 ఉప ఎన్నికలలో ఘనవిజయం సాధించిన ఆయన 2014 ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక గత ఎన్నికలలో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాంటి నేతను వైసిపి అవమానకర రీతిలో బయటకు పంపేసింది.
దీంతో ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి స్థానాన్ని వైసిపిలో ఎవరు ? భర్తీ చేస్తారు.. పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ? అన్నదానిపై జిల్లా రాజకీయాల్లో చర్చలు అయితే మొదలయ్యాయి. అయితే ఇప్పటికిప్పుడు జగన్కు వైసిపి నుంచి ఉదయగిరిలో బలమైన నేత అయితే దొరికే పరిస్థితి లేదు. కావ్య కృష్ణారెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, మెట్టుకూరు చిరంజీవి రెడ్డి లాంటి పేర్లు అయితే వినిపిస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించటానికి ముందే వైసిపి అధిష్టానం కావలి మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డిని పిలిపించుకున్నట్టు తెలుస్తోంది. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఎవరో కాదు ? చంద్రబాబు తయారుచేసిన నేత. 1999లో చంద్రబాబు వేణుగోపాల్ రెడ్డికి కావలి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికలలో ఆయన కలికి యానాదిరెడ్డి పై విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నెల్లూరు లోకసభ ఉప ఎన్నికలలో చంద్రబాబు ఆయనకు ఎంపీ సీటు ఇచ్చారు.
గత ఎన్నికలకు ముందు ఆయన వైసిపిలోకి జంప్ చేసి ఉదయగిరిలో ప్రచారం చేసేందుకు ప్రయత్నించినా… చంద్రశేఖర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఒంటేరు అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పుడు అటు ఇటు తిరిగి ఆ పాత టిడిపి కాపునేత ఇక్కడ వైసిపికి గతి అయ్యారు. మరి జగన్ ఒంటేరుకే కావలి వైసిపి ఇన్చార్జి పగ్గాలు అప్పగిస్తారని ప్రస్తుతానికైతే ప్రచారం జరుగుతుంది. రేపటి అసెంబ్లీ ఎన్నికలలో ఒంటెరుకే సీటు దక్కుతుందా లేదా కావ్య కృష్ణారెడ్డి లాంటివాళ్ళు సీటు ఎగరేసుకుపోతారా ? అన్నది అప్పుడే చెప్పలేని పరిస్థితి.