ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైసీపీలో పెద్ద బడబాగ్ని మిగిల్చాయి. క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించడంతో వైసీపీ పెద్దలు తమ పార్టీకే చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. ఇక పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గత రెండు రోజులుగా పార్టీతో పాటు పార్టీలో జరుగుతోన్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ప్రస్తుతం గుండె సంబంధిత ఆపరేషన్ నేపథ్యంలో బెంగళూరులో ఉంటోన్న చంద్రశేఖర్ రెడ్డి వైసీపీతో పాటు జగన్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీలో ఎమ్మెల్యేలకు జగన్ సరైన గుర్తింపు ఇవ్వడం లేదని.. కనీసం సీనియర్లను కనీసం గౌరవించే సంస్కృతి కూడా అక్కడ లేదని ఆయన వాపోయారు. ఎవరైనా నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా చేయరని.. తాను రాజశేఖర్ రెడ్డికి అభిమానిని అని… రాజశేఖర్రెడ్డి వద్ద ఉండే గౌరవ మర్యాదలు జగన్ వద్ద లేనే లేవని చంద్రశేఖర్ కుండబద్దలు కొట్టేశారు.
ఇక నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వనని మూడు నెలల క్రిందటే చెప్పారు. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు.. నాకు ఎమ్మెల్సీ వద్దని జగన్కు చెప్పాను.. నేను ఉదయగిరిలో ఎమ్మెల్యేగా ఉండగా.. ఎవరో సలహాదారులను తెచ్చి నా నెత్తిన పెట్టడం ఏంటని ? సలహాదారులు జగన్కు ఇచ్చే సలహాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. వైనాట్ 175 అనడానికి జగన్కు ఉన్నం ధైర్యం ఏంటో ? అసలు పార్టీలో 40 – 50 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు.
బటన్ నొక్కి అంతా బాగుందని అనుకుంటున్నారు.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం చాలా ప్రమాదం.. ఇక కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని.. ఎమ్మెల్యేలను గౌరవించని పార్టీలు మూసుకోవాల్సిందే అని మండిపడ్డారు. అది వైసీపీయే కాదు.. టీడీపీ, కమ్యూనిస్టులు అయినా అని చెప్పారు. ఇక సీఎం అనుకుంటే పక్కన ఉన్న వాళ్లూ నమస్కారం పెట్టరని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదేమైనా మేకపాటి వైసీపీలో అంతర్గతంగా జరుగుతోన్న చాలా విషయాలు బయటపెట్టారు. అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. మరి సాధారణ ఎన్నికలకు యేడాది టైం ఉన్న వేళ పార్టీలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ? చూడాలి.