ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార వైసిపిలో కాక రేపుతున్నాయి. మొత్తం ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏడు స్థానాలలోనూ వైసిపి విజయం సాధించాల్సి ఉండగా.. అనూహ్యంగా వైసిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడడంతో టీడిపి అభ్యర్థి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. దీంతో అధికార వైసిపికి అదిరిపోయే షాక్ తగిలింది.
ఇక పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారంటూ వైసిపి నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు వేసింది వైసిపి. ఇదే సమయంలో వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడిపి అధినేత చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యే కు 10 నుంచి 15 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
అయితే సజ్జల చేసిన ఆరోపణలపై పార్టీ నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆయన చాలా ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి కానీ.. టీడిపి కానీ ఓటు వేయమని నన్ను అడగలేదని ఆయన చెప్పారు. తాను ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తాను అని చెప్పానని.. ఆ మేరకే తాను ఓటు వేశానని తెలిపారు. తాము అమ్ముడు పోయామని సజ్జల చేసిన ఆరోపణలపై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను మీరు ఎన్ని కోట్లకు ? కొన్నారు అంటూ సజ్జలను నిలదీశారు.
మీ చేతిలో అధికారం ఉందని సస్పెండ్ చేశారు. కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి బహిష్కరిస్తారా ? అని కోటంరెడ్డి మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని.. పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి శుక్రవారం తన అనుచరులతో చంద్రబాబు సమక్షంలో టీడిపిలో చేరిన సంగతి తెలిసిందే. ఏదేమైనా కోటంరెడ్డి వేసిన ప్రశ్నకు ఇప్పుడు వైసిపి నేతలతో పాటు.. ఆ పార్టీ అధినేత జగన్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది.