త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఎట్టకేలకు ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఎన్టీఆర్ కు జోడిగా దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్, జాన్వి కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లాంటి ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ హాజరయ్యారు.
అయితే ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజమౌళి హీరోయిన్ జాన్వీ దగ్గరికి వెళ్లి చాలాసేపు ముచ్చట్లు పెట్టారు. వారిద్దరూ అంతసేపు మాట్లాడుకోవడంతో వారిద్దరి మధ్య సంభాషణ ఏమై ఉంటుందా ? అన్న గుసగుసలు అక్కడ నడిచాయి. చాలామంది అయితే రాజమౌళి తన తర్వాత సినిమా మహేష్ బాబుతో తీస్తుండడంతో మహేష్ కు జోడిగా జాన్విని తీసుకునేందుకే చర్చలు జరుపుతున్నారని అనుకున్నారు.
ఆ తర్వాత రాజమౌళి ఒక స్లిప్ ఇవ్వటం.. జాన్వి ఆ స్లిప్ మీద ఏదో రాసి తిరిగి ఇవ్వడంతో అందరూ ఇది కచ్చితంగా మహేష్ సినిమా కాల్ షీట్లు రాయించుకున్నాడని అనుకున్నారు. అయితే అసలు విషయం వేరే ఉంది… రాజమౌళి కుమార్తె మయూఖ జాన్వీ కపూర్ కి వీరాభిమాని. తన తండ్రిని మయూఖ ముందుగానే జాన్వి కపూర్ ఆటోగ్రాఫ్ తీసుకురా అని రిక్వెస్ట్ చేసిందట. అందుకే రాజమౌళి అడిగిన వెంటనే జాన్వి ఒక స్లిప్ మీద ఆటోగ్రాఫ్ పెట్టి ఇచ్చింది.
రాజమౌళి తనకు అలా కాదని మంచి ప్రేరణతో కూడిన ఒక కొటేషన్ రాసిన తర్వాత.. తన కుమార్తె పేరు రాసి సంతకం చేసి ఇవ్వమని రిక్వెస్ట్ చేశారట. వెంటనే జాన్వి మరో పేపర్ మీద అలాగే రాసి ఇచ్చింది. రాజమౌళి ఆ రెండు పేపర్లను జాగ్రత్తగా పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి తన కుమార్తెకు ఇస్తానని చెప్పారు. ఆ విషయం తెలియని చాలామంది మహేష్ – రాజమౌళి సినిమాలో కూడా జాన్వీ ని తీసుకునేందుకు జక్కన్న చర్చలు జరిపారని గుసగుసలాడుకున్నారు.