ఆయన ఒకప్పుడు ఆ పార్టీలో టాప్ లీడర్. సమైక్య రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారు. జిల్లా రాజకీయాలు ఆయన కనుసన్నల్లోనే నడిచాయి. ఆ పార్టీ అధినేత దగ్గర ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది. అలాంటి నేత కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. అసలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు.. ఎప్పుడు ఏ పార్టీని విమర్శిస్తారో కూడా అర్థం కావడం లేదు. రాజకీయంగా ఆయన పూర్తిగా కనుమరుగు అయ్యే దశకు వచ్చేశారు. దీంతో ఏడోసారి పార్టీ మారెందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన మారని పార్టీ అంటూ ఏదీ లేదు. ఒక్క ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మినహా అన్ని పార్టీల కండువాలను ఆయన కప్పుకున్నారు. 2009 ఎన్నికల నుంచి ఆయనకు కాలం కలిసి రావడం లేదు. 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా.. కేవలం రెండేళ్ల ఎమ్మెల్యే పదవికి మాత్రమే పరిమితం అయ్యారు. కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీతో ప్రారంభం అయింది.
2004 వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో తెలుగుదేశం పార్టీలో చేరిన కొత్తపల్లి ఏకంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచారు. కాపు సామాజిక వర్గం నేతగా చంద్రబాబు దగ్గర కూడా మంచి పలుకుబడి ఉండేది. 2009లో కుల సమీకరణలకు లొంగిపోయి చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
పార్టీ ఓడిపోయిన వెంటనే తిరిగి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు కూడా సీనియర్ నేత కావడంతో ఆయనకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. చివరకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని చంద్రబాబుని తీవ్రంగా విమర్శించి మళ్లీ వైసిపి కండువా కప్పుకున్నారు. ఇప్పుడు జగన్ కొత్త పల్లిని ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు ఈ నాలుగేళ్లలో ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. జగన్ పార్టీ మారిన నేతలకు ఎంతోమందికి ఎన్నో పదవులు ఇచ్చారు. కొత్తపల్లికి కనీసం పదవి కాదు కదా ?అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి.
దీంతో నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ కొత్తపల్లి పార్టీ లైన్కు వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. దీంతో వైసిపి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. త్వరలోనే తాను ఏ పార్టీలో చేరతానో చెప్పుతానని కొత్తపల్లి అంటున్నారు. కొత్తపల్లిపై నమ్మకం లేక ఆయనను ఏ పార్టీ చేర్చుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ వయా ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం, వైసీపీ ఇప్పుడు మళ్లీ టీడీపీనా లేదా జనసేననా ? అన్నది తెలియట్లేదు. టీడీపీలో టిక్కెట్ వస్తుందన్న గ్యారెంటీ లేకపోతే కొత్తపల్లి జనసేనలోకి చేరి టీడీపీతో పొత్తు ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అయినా చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఏదేమైనా కొత్తపల్లి మళ్లీ కొత్త కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు.