నిన్న మొన్నటి వరకు మిత్రులుగా ఉంటూ చట్టాపట్టాలేసుకుని తిరిగిన వైసీపీ నేతలు.. నేడు బద్ధ శత్రువులు అయిపోయారు. ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో వీరే ఒకరితో ఒకరు పోటీ పడనున్నారు. దీంతో ఇప్పుడు అక్కడ రాజకీయం ఆసక్తిగా మారింది. 2014 – 2019 2రెండు ఎన్నికల్లోను కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి.. అనిల్ కుమార్ నెల్లూరు సిటీ నుంచి వరుసగా వైసీపీ తరఫున విజయం సాధించారు. అయితే సామాజిక సమీకరణల్లో అనిల్ కు జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కీలకమైన జలవనరుల శాఖ మంత్రి పదవి దక్కింది.
అనిల్ కు మంత్రి పదవి వచ్చినప్పుడు కూడా కోటమరెడ్డి సహకరించారు. జిల్లాలో ఆనం, మేకపాటి వర్గానికి వ్యతిరేకంగా వీరిద్దరూ గ్రూపు కట్టారు. మంత్రివర్గ విస్తరణలో అనిల్ పదవి పోయింది. కచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని కోటంరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు బదులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డికి జగన్ క్యాబినెట్లో చోటు దక్కింది. అప్పటినుంచి కోటంరెడ్డి వైసీపీ అధిష్టానంపై విమర్శలు చేస్తూ ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేసారు.
ఇక వచ్చే ఎన్నికల్లో తాను టిడిపి నుంచి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే కోటంరెడ్డి సంకేతాలు ఇచ్చేశారు. దీంతో అనిల్ వర్సెస్ కోటంరెడ్డి మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. గతంలో అనిల్ వివేకానంద రెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళింట్లో కార్లు కడిగాడని… 2009లో అనిల్ కు టికెట్ ఇప్పించిన వివేకా ఇంటి మీదకే దాడికి వెళ్లారని గుర్తు చేశారు. ఇటు అనిల్ కూడా కోటంరెడ్డి నమ్మకద్రోహం చేశాడు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోని కోటంరెడ్డి మరో అడుగు ముందుకు వేసి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పై కన్నేశారు.
ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నెల్లూరు రూరల్ నుంచి టిడిపి తరఫున మైనార్టీ నేత మహమ్మద్ అజీజ్ పోటీకి రెడీ అవుతున్నారు. అజీజ్ ను తప్పిస్తే మైనార్టీలో వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు కోటంరెడ్డి పార్టీలోకు వస్తే నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి నారాయణ ఇప్పుడు టీడీపీలో యాక్టివ్ గా లేరు. అందుకే కోటంరెడ్డి వ్యూహాత్మకంగానే నెల్లూరు సిటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో వీరిద్దరు పోటీ పడితే నెల్లూరు సిటీ రాజకీయం రసవత్తరమే..!