ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలవేళ రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఓవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 నియోజకవర్గాల్లోనూ సొంతంగానే పోటీ చేస్తుందని.. దమ్ముంటే చంద్రబాబు – పవన్ వేరువేరుగా పోటీ చేయాలని వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ సవాళ్లు విసురుతున్నారు. ఇటు వచ్చే ఎన్నికల్లో టిడిపి – జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయన్న లీకులు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో టిడిపి నుంచి గెలిచిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు… ఇతర పార్టీలో అవకాశం దక్కదని భావిస్తున్న వారంతా కూడా జనసేన బాట పడుతూ ఉండటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
గతంలో టిడిపి నుంచి గెలిచిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఎదర హరిబాబు, జనసేన కండువా కప్పుకోనున్నారు. ఆయన 1994లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేశారు. తర్వాత బిజెపిలో చేరిన ఆయన అక్కడ అంత క్రియాశీలకంగా లేరు. ఇప్పుడు జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.
ఇక తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కూడా జనసేనలో చేరుతున్నారు. 2009లో ఆయన కొవ్వూరు నుంచి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 – 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. అక్కడ కూడా ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరతారని ప్రచారం జరిగిన ఆయన దానిని ఖండించారు.
అయితే చివరకు రామారావు కూడా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకొన్నన్నట్టుగా తెలుస్తుంది. వీరంతా జనసేన వైపు మొగ్గుచూపుటానికి కారణం. వచ్చే ఎన్నికల్లో టిడిపి – జనసేన పొత్తు ఖాయం అని తెలుస్తోంది. టిడిపితో పొత్తు ఉంటే జనసేన తరఫున పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలోకి వెళ్లే ప్లానింగ్ తోనే పలువురు అవుట్ డేటెడ్ నేతలు కూడా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు.