తెలుగు సినిమా చరిత్రలో 1960 – 70వ దశకంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత తరం హీరోయిన్లకు ముందు తరం హీరోయిన్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. 1960 – 70వ దశకంలో ఉన్న స్టార్ హీరోయిన్లు తెరమీద నటిస్తున్నారు.. అనడం కంటే జీవించేవారు. ముఖ్యంగా ఎక్స్ప్రెషన్లు ఇవ్వడంలోనూ, నాట్యం చేయటంలోనూ, డైలాగులు చెప్పటంలోనూ, పౌరాణిక, సాంఘిక, జానపద ఇలా ఏ పాత్రలో అయినా ఒదిగిపోవటంలోనూ వారికి వారే సాటి ఆ తరంలో వచ్చిన గొప్ప హీరోయిన్లో ఎల్. విజయలక్ష్మి ఒకరు.
ఆమెకు చిన్నప్పటి నుంచే భరతనాట్యం అంటే ఇష్టం. భరతనాట్యంలో సరైన గురువు కోసమే వీరి కుటుంబం పూణే నుంచి చెన్నై వచ్చింది. చాలా తక్కువ సమయంలోనే చక్కని నాట్య కళాకారునిగా పేరు తెచ్చుకుంది. ఆ రోజుల్లో ఎల్ విజయలక్ష్మి మంచి డ్యాన్సర్. ఆమె సినిమాల్లో డ్యాన్స్ చేస్తుంది అంటే ఆమె నడుముకి ఎముక లేకుండా నృత్యం చేస్తుందనే గొప్పగా చెప్పుకునేవారు.
ముందుగా తెలుగు సినిమాలలో నటించే అవకాశం రాగా.. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని తమిళ సినిమాల్లో నటించింది. ఇక ఆమె ఎన్టీఆర్ పక్కన ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించింది. జగదేకవీరుని కథ – ఆరాధన – గుండమ్మ కథ – బొబ్బిలి యుద్ధం – రాముడు భీముడు – పరమానంద శిష్యుల కథ, శ్రీకృష్ణ అవతారం లాంటి ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగులో మిగిలిన హీరోల కంటే ఎన్టీఆర్ కి జోడిగా ఆమె బాగా సెట్ అయింది.
ఎన్టీఆర్ విజయలక్ష్మి జోడిని తెరమీద చూస్తుంటే కన్నుల పండుగగా ఉండేది. ఆ రోజుల్లో ఆమె డ్యాన్స్ చేస్తున్నారు అంటే ఆమెతో పోటీపడి డ్యాన్స్ చేసేందుకు హీరోలు చాలా ఇబ్బంది పడేవారట. అంత చురుకుగా ఆమె తన నడుమును తిప్పేవారు. చివర్లో తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. ఆమెకు ఎన్టీఆర్ స్మారక పురస్కారం బహుకరించారు. విజయలక్ష్మి 1960 నుంచి 1969 వరకు మాత్రమే సినిమాలు చేశారు.
ఆ తర్వాత ఆమెను ప్రేమించిన వ్యక్తిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మనీలాలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సురజిత్ కుమార్ దత్తాను పెళ్లి చేసుకుని ఆమె అక్కడే స్థిరపడ్డారు. అక్కడ ఖాళీగా ఉన్న సమయంలో చేసేదేమీ లేక వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత చదువులు చదివారు. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డ విజయలక్ష్మి అక్కడ వర్జినీయా పాలిటెక్నిక్ కళాశాలలో బడ్జెట్ అధికారిగా పనిచేస్తున్నారు.
గతేడాది చివర్లో ఆమెకు ఎన్టీఆర్ స్మారక పురస్కారం ఇవ్వాలని బాలయ్య పట్టుబట్టి ఇండియాకు రప్పించి మరి అవార్డు అందజేశారు. ఆమె 1969 లోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా ఎన్టీఆర్ ను మాత్రం ఎంతో ప్రేమించేవారు. ఎన్టీఆర్ అంటే ఆమెకు ఒక విధమైన భక్తి.. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ ను ఒక దేవుడిగానే ఆమె భావించే వారని.. ఆమె గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. ఆ అభిమానంతోనే ఆమె చాలా ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ఎన్టీఆర్ స్మారక అవార్డు స్వీకరించారు