విశాఖపట్టణం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాడాలన్నది ఉత్తరాంధ్రవాసుల దశాబ్డాల కల. దానిని సాధించుకోవడానికి ఏండ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో విశాఖ జోన్ ఏర్పాటుకు సమయంలోనూ దీనిపై తీవ్రంగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందుకు అనుగణంగా ప్రతిపాదనలు పంపించాలని అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది. ఆ తరువాత కేంద్రంలో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడం, బీజేపీ పగ్గాలను చేపట్టడడంతో ఆ ఫైలు మూలకు పడింది. ఈ నేపథ్యంలో గడిచిన ఐదేళ్ళ కాలంలో విశాఖ జోన్ కోసం సాగించిన పోరాటం, రాజకీయ ఒత్తిళ్ళు ఫలితంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందుకు మోడీ సర్కార్ దానిపై దృష్టి సారించింది.జోన్ ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. విశాఖ పట్టణం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు 2019 ఫిబ్రవరి 27 వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదీగాక ఆ వెంటనే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ రెండో ఓఎస్డీగా ధనుంజయులుని నియమించింది. సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించాలని అదేశించింది. ఇదిలా ఉండగా ఆ డిపిఆర్ సిద్ధంచేసి సెప్టెంబర్ మొదటి వారంలో రైల్వే బోర్డుకు ఓఎస్డీ సమర్పించారు. నాటి నుంచి అక్కడి నుంచి జోన్ అంశం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మొత్తంగా ఆ అంశాన్నే పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది.
ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు, నూతన రైళ్లకు సంబంధించి బోర్డు నుంచి వస్తున్న సంకేతాలు పరిశీలిస్తే జోన్ ఏర్పాటుపై కేంద్ర వైఖరిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వేజోన్ కార్యాచరణ… జీఎం నియామకం.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎప్పటి నుంచి మనుగడలోకి వస్తుంది? భూముల సేకరణ వివరాలు వెల్లడించాలని కోరుతూ విశాఖ వాసి ఒకరు ఆర్టీఐ కింద రైల్వే బోర్డు నుంచి సమాచారం కోరాడు. అందుకు రైల్వే బోర్డు నుంచి వచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తే జోన్ ఏర్పాటు మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. ప్రస్తుతం డిపిఆర్ పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది. దీనిపై పలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అదీగాక వాస్తవానికి జోన్ ప్రకటన వెలువడినప్పుడే నెలల వ్యవధిలో విభజన ప్రక్రియ మొదలవుతుందని, కేంద్రం చిన్న చూపు చూడడం వల్లే అది ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా రాయగఢ్ డివిజన్, విశాఖ జోన్ ఏర్పాటుకు 170కోట్ల రూపాయలు అంచనాలు రూపొందిస్తే రూ.3కోట్లను మాత్రమే కేటాయించడం కేంద్రం వైఖరికి అద్దం పడుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.