యంగ్ హీరో సంతోష్ శోభన్ – నందినీ రెడ్డి కాంబినేషన్లో స్వప్నా దత్, ప్రియాంక దత్ లాంటి టేస్ట్ ఉన్న నిర్మాతలు నిర్మించిన సినిమా అన్నీ మంచి శకునములే. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందంటే ఓ రొటీన్ స్టఫ్ ఉన్న స్టోరీ అని చెప్పాలి. సినిమా కథా పరంగా చూస్తే ఓ హిల్ స్టేషన్లో ఉండే విక్టోరియాపురం అనే స్మాల్ టౌన్లో ఒకే రోజు పుడతారు రిషి (సంతోష్ శోభన్).. ఆర్య (మాళవిక నాయర్).
అయితే ఆ హాస్పిటల్లో జరిగిన మిస్టేక్ వల్ల ఇద్దరూ బద్ధ శత్రవులుగా ఉన్న వాళ్ల ఇళ్లలోకి మారిపోతారు. అంటే రిషి.. ఆర్య వాళ్ల ఇంట్లో కొడుకుగా పెరిగితే… ఆర్య.. రిషి వాళ్ల ఇంట్లో అమ్మాయిగా పెరుగుతుంది. ఈ మిస్టేక్ను ఆలస్యంగా గుర్తించినా ఓ డాక్టర్ చెప్పకుండా దాచి పెడుతుంది. అప్పటికే రిషి, ఆర్య కుటుంబాల మధ్య ఉన్న ఆస్తి గొడవలు, కోర్టు గొడవలు ఉండడం.. వాళ్లిద్దరు కలిసి ఒకే స్కూల్లో చదువుతూ స్నేహితులు అవ్వడం జరుగుతుంది.
చిన్నప్పటి నుంచి ఆర్య.. రిషిని ఇష్టపడినా ఎప్పుడూ తన ప్రేమను బయట పెట్టడు. ఓ బిజినెస్ ట్రిప్లో యూరప్ వెళ్లిన ఇద్దరు అక్కడ జరిగిన గొడవ కారణంగా ఒకరినొకరు దూరమవుతారు. ఆ తర్వాత ఆర్య మరో అబ్బాయిని ఇష్టపడుతుంది. రెండేళ్ల తర్వాత ఇద్దరూ తిరిగి కలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత వీరి ప్రేమ ఏమైంది ? ఈ రెండు కుటుంబాలకు నిజం ఎలా ? తెలిసింది ? ఈ రెండు కుటుంబాల ఆస్తి గొడవలు ఏమయ్యాయి అన్నదే సినిమా కథ.
అన్నీ మంచి శకునములే ఇదో ఫీల్ గుడ్ ఫ్యామిలీ లవ్ స్టోరీ. కామెడీతో పాటు ఎమోషనల్గా బాగుంటుంది. హీరో, హీరోయిన్లు ఇద్దరూ తమ పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కీలక పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ నటన చాలా బాగుంది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం సినిమాకు చాలా ప్లస్ పాయింట్. దర్శకురాలు నందిని రెడ్డి రెండు కుటుంబాలపై మంచి లైన్ తీసుకున్నా పూర్తిగా ఆకట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకోలేదు.
ప్రేమ సీన్లు సరిగా లేవు. ప్రేమలో సంఘర్షణ మధ్య బలమైన స్కోప్ లేదు. సెకండాఫ్లో వీరి మధ్య లాగ్ సీన్లు ఎక్కువ అయ్యాయి. స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ తో నడుస్తుంది. ఫస్టాఫ్లో కామెడీ సీన్లు, ఇంటర్వెల్ సీన్ మినహా సెకండాఫ్లో ఎమెషనల్గా కనెక్ట్ చేయాలన్న దర్శకురాలి ప్రయత్నం కూడా పెద్దగా ఫలించలేదు. ఓవరాల్గా లవ్ సీన్లతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్లు మాత్రమే ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. అంతకు మించి గొప్పగా ఏం ఉండదు.