గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల ఓటమి పాలైన టిడిపి నేతల్లో దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) కూడా ఒకరు. ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన భారీగా ఓట్లు చీల్చింది. దాదాపు 33 వేల ఓట్లు జనసేనకు పడ్డాయి. దీంతో టిడిపిపై వైసీపీ 5 వేల పైనే ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఒకవేళ టిడిపి-జనసేన కలిసి ఉంటే ముమ్మిడివరంలో వైసీపీ గెలిచేది కాదు.
అయితే గతంలో ముమ్మిడివరంలో టిడిపికి పట్టు ఉండేది..అక్కడ మంచి విజయాలే సాదించింది. 1983, 1985, 1996 ఉపఎన్నిక, 1998 ఉపఎన్నిక, 1999 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. మళ్ళీ 2014లో టిడిపి గెలిచింది. అయితే 2009లో ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల అప్పుడు టిడిపి దాదాపు 2 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ చేతుల్లో ఓడింది. ఇక 2014లో టిడిపికి జనసేన మద్ధతు ఇవ్వడంతో..టిడిపి నుంచి బుచ్చిబాబు 29 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..బుచ్చిబాబు 5 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు.
అలా ఓటమి పాలైన బుచ్చిబాబు ఈ సారి పొత్తుతో సంబంధం లేకుండా గెలవాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రజా మద్ధతు పెంచుకుంటూ వస్తున్న బుచ్చిబాబు..జనసేన ఓట్లు చీల్చిన గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. పైగా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ పై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తుంది. దీంతో ముమ్మిడివరంలో వైసీపీ బలం తగ్గుతుంది. అయితే ఇక్కడ జనసేనతో టిడిపికి ఎలాగైనా ఇబ్బందే ఉంది.
ఒకవేళ పొత్తు ఉంటే ఈ సీటు తీసుకోవాలని జనసేన నేత పితాని బాలకృష్ణ ట్రై చేస్తున్నారు. ఇటు టిడిపి నేత బుచ్చిబాబు కూడా సీటు కోసం చూస్తున్నారు. ఇలా టిడిపి-జనసేనల మధ్య సీటు పోటీ ఉంది. పొత్తు లేకపోతే మాత్రం జనసేన ఓట్లు చీలుస్తుంది. ఆ ఓట్ల చీలికతో నష్టం లేకుండా చూసుకోవాలని బుచ్చిబాబు చూస్తున్నారు. చూడాలి మరి ఈ సారి ముమ్మిడివరం ఎవరికి దక్కుతుందో.