నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు చిత్రసీమలో రాణించిన రోజా రమణి… బాలనటిగా భక్తప్రహ్లాదతో అబ్బురపరిచింది. తర్వాత కాలంలో హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు హిట్స్ అయిన ఆడపడుచు, లవకుశ, సతీ అనసూయ ఒరియా రీమేకుల్లో హీరో చక్రపాణితో కలిసి నటించింది రోజా రమణి. వీరి స్నేహం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లల్లో ఒకరు హీరో తరుణ్ అన్న విషయం తెలిసిందే.
1984 నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారి స్క్రీన్పై తన గొంతు పలికించింది రోజా రమణి. దాదాపు 300 మంది హీరోయిన్లకు గాత్రదానం చేసింది. తాజాగా ఆమె అన్నగారు రామారావు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అన్నగారితో మొదటిసారి ‘తాతమ్మ కల` సినిమాలో రోజా రమణి నటించింది. అదేవిధంగా డ్రైవర్ రాముడు సినిమాలో అన్నగారికి చెల్లిగా నటించింది. ఈ సినిమాలోని ఓ పాట చివర్లో ఆమె ఎన్టీఆర్ కాళ్ల మీద పడి ఏడుస్తూ ఉండిపోయింది. డైరెక్టర్ రాఘవేంద్రరావు వీళ్లను చూసి ఎమోషనలై కట్ చెప్పకుండా సీన్లో లీనమైపోయారు.
ఇదే సినిమా మరో సీన్లో విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద షూటింగ్ జరుగుతోంది.. సూసైడ్ చేసుకోవడానికి పరుగెత్తుతోంది. రోజా రమణి వెనకాల హరికృష్ణ(ఎన్టీఆర్ కుమారుడు తొలి పరిచయం) ఆగు చెల్లెమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. నడిరోడ్డు మీద ఎన్టీ రామారావు డైరెక్షన్ చేస్తున్నారు. వేలాదిమంది జనం గుమిగూడి షూటింగ్ చూస్తున్నారు. రోజా రమణి బ్యారేజీ రెయిలింగ్ దగ్గర కాస్త హైట్ కోసం ఖాళీ క్యాన్ల మీద నిలబడింది. ఆ క్యాన్లు ఊగిపోతుండటంతో ఎన్టీఆర్ వెంటనే వచ్చి ఆమె నిజంగానే నదిలో పడిపోకుండా ఆమె కాళ్లు పట్టుకుని యాక్ట్ చేయమన్నారు.
కాస్త అజాగ్రత్తగా ఉన్నా నిజంగా అక్కడ రోజా రమణి సూసైడ్ జరుగుతుందని ఆయన భయపడ్డారు. అందుకే ఆయనే స్వయంగా వచ్చి వేలాది మంది జనం ముందు ఏమాత్రం ఆలోచించకుండా రోజా రమని కాళ్లు పట్టుకున్నారు. ఆయన చేసిన పనికి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయని ఓ సందర్భంలో రోజా రమణి చెప్పుకొచ్చారు. అన్నగారితో అనుబంధం .. ఓ తండ్రితో అనుబంధమని ఆమె పేర్కొన్నారు.