ఉరుమిరుమి మంగళం మీద పడ్డట్టు తయారైంది లెఫ్ట్ పార్టీల పరిస్థితి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీల రాజకీయా ఎత్తుగడలో ఈ ఎర్రదళం బేజారవుతున్నది. తమ ఉనికినే కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాజకీయంగా కనుమరుగు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. వైసీపీ ప్రవేశపెట్టిన బిల్లులను తన రాజకీయ చతురతను ప్రదర్శించి శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవడం, దీంతో కన్నెర్ర జేసిన సీఎం జగన్ కౌంటర్గా ఏకంగా శాసన మండలి రద్దుకే పావులు కదుపుతుండడం తెలిసిందే. ఇక్కడే మొదలైంది సమస్య. లెఫ్ట్ పార్టీలకు చిక్కు. అదేలాగంటే ఇప్పటివరకు లెఫ్ట్ పార్టీలను అసెంబ్లీలో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. ఉన్నది ఒక్క మండలిలోనే. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కలుపుకుని 9 మంది ఉన్నారు. ఒకవేళ జగన్ మండలిని రద్దు చేస్తే ఇక అవి పోయే పరిస్థతి ఏర్పడింది. దీంతో సంకట పరిస్థితిలో పడిపోయారు.
ఇదే విషయమై తమ ఉనికిని కాపాడుకునేందుకు జగన్ను బుజ్జగించేందుకు లెఫ్ట్ పార్టీల నేతలు రంగంలోకి దిగారట. వైసీపీ, టీడీపీల మధ్య సయోధ్యను కుదిర్చి మండలి రద్దను విరమించుకునేలా చేయాలని చూస్తన్నారట. ఇప్పటికే ఈ విషయమై వైసీపీ పెద్దలను, జగన్ను సంప్రదించారని సమాచారం. అయితే తమకు రాజకీయంగా మండలి అవసరమున్నా టీడీపీ కొర్రీలతో చిక్కు వస్తున్నదని ఆ పార్టీ వారికి తెలిపిందట. కొన్ని షరతులను పెట్టిందట. రాజధాని బిల్లులనే కాకుండా, భవిష్యత్లోనూ మరే బిల్లులను అడ్డుకోకూడదని, టీడీపీని వీడి వైసీపీలోకి చేరే సభ్యులపై వేటు వేయకూడదని, మండలి చైర్మన్ రాజీనామా చేయాలని కండీషన్లను పెట్టిందట. అయితే వీటిని టీడీపీ ఎలాగూ ఒప్పకోదని వారు లబోదిబోమంటున్నారు. అయితే వారిలోనూ చిన్న ఆశ ఇంకా మిణుమిణుకు మంటూనే ఉంది. టీడీపీలోనూ మెజార్టీ సంఖ్యలో సభ్యులు రద్దు విషయమై అసంతృప్తితో ఉన్నారని తెలసి వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. వారు పార్టీని వీడితే రద్దు వాయిదా పడవచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు లెఫ్ట్ పార్టీల నేతలు.