విచక్షణాధికారం పేరిట వైసీపీ ప్రభుత్వం పంపిన ప్రతిష్టాత్మక రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సలెక్ట్ కమిటీకి పంపిన ఏపీ శాసన మండలి చైర్మన్ పదవికే ఎసరు తెచ్చేలా ఉంది. ఇప్పటికే శాసనసభ రద్దు చేసే అంశంపై కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ప్లాన్ బీని కూడా అమలు చేస్తున్నారట. మండలి చైర్మన్కు ఉద్వాసన పలికేందుకు వ్యూహం రచిస్తున్నారని విపక్ష నేతలే ఆరోపిస్తున్నారు. ఇప్పడిదే చర్చనీయాంశంగా మారింది. సర్వత్రా ఆసక్తి నెలకొంది. శాసనమండలిలో విపక్ష టీడీపీకి బలముండడంతో రాజధాని బిల్లు విషయంలో ఇప్పటికే ఒకదఫా దెబ్బతిన్నారు. భవిష్యత్లోనూ ఆ ప్రమాదం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా మండలినే రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టారు. సోమవారం నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో మండలి రద్ద అంశంపై కీలకంగా చర్చించనున్నారు. ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.
ఇదిలా ఉండగా శాసన మండలి ఉండడము రాజకీయంగా వైఎస్ఆర్సీకి కూడా ముఖ్యమే. ఈ నేపథ్యంలో జగన్ ప్లాన్ బీని కూడాను అమలు చేస్తున్నారని తెలుస్తున్నది. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీలుకు భారీ మొత్తంలో ఎరచూపి వైసీపీలోకి లాగేందుకు యత్నిస్తున్నారని సమాచారం. తద్వారా మండలిలో టీడీపీ బలాన్ని తగ్గించి తొలుత అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టి చైర్మన్ను తొలిగించి, ఆ స్థానంలో అనుకూల వ్యక్తిని కూర్చోబెట్టి బిల్లులను ఆమోదింప జేసుకోవాలని వ్యూహం రచించారని తెలుస్తున్నది. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పగో జిల్లాకు చెందిన ఓ ఎమ్మల్సీని కొనబోయారని, అందుకు ఆయన తిరస్కరించారని ఆ పార్టీ నేతలు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అదీగాక జగన్ వ్యూహాన్ని దెబ్బకొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి పార్టీ ఎమ్మెల్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాడట. భరోసా కల్పిస్తూ పట్టుతప్పిపోకుండా చూస్తన్నాడట. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన టీడీపీ శాసనసభా పక్షా సమావేశానికి నలుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడం ఆసక్తికరంగా మారింది. వారిలో శత్రుచర్ల విజయరామారావు అనారోగ్యంతో వైద్యశాలలో ఉండగా, మిగతా ముగ్గురు కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, సరస్వతీ వ్యక్తిగత కారణాలతో రావడం లేదని సమాచారం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలుపుతన్నారు. అయినా వారు పార్టీ వీడుతున్నారే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ డొక్క రాజీనామా చేయగా, మరో ఇద్దరు జగన్కు మద్దతివ్వడం గమనార్హం.