ఆంధ్రప్రదేవ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సినీ ఫక్కీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ట్విస్ట్ల మీద ట్విస్ట్తో హాట్గా మారుతున్నాయి. రాజకీయ వర్గాల్లో వేడికపుట్టిపుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ తన ప్రాధాన్యతా అంశాలుగా తీసున్న అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంతీయ అభివృద్ధి అథారిటీ చట్టం రద్దు బిల్లులను అసెంబ్లీలో ఆమోదింపజేసుకుంది. అసెంబ్లీలో భారీ మెజార్టీ ఉండడంతో అక్కడ అధికార పార్టీకి ఎలాంటి ఇబ్బదులు తలెత్తలేదు. అనంతరం ఆ బిల్లులు మండలికి చేరాయి. అక్కడ విపక్ష సభ్యులు అధిక సంఖ్యలో ఉండడంతో బిల్లుల ఆమోదంలో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో రూల్ ఆఫ్ 71న పేరిట విపక్ష పార్టీలు నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై చర్చకు ఆస్కారమేర్పడలేదు. అదిగాక తన విచక్షణాధికారాలో మండలి చైర్మన్ షరీఫ్ ఆ సెలక్ట్ కమిటీకి పంపి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తాజాగా మళ్లీ సంచలన నిర్ణయం తీసుకుని విపక్ష టీడీపీకి షాక్ ఇచ్చారు. ఏకంగా ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.
బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంపై వైసీపీ మంత్రులు, సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్ పోడియంలోకి వెళ్లేందుకు యత్నించారు. అదీగాక చైర్మన్పై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ నేపథ్యంలోనే బిల్లులను సెలక్ట్ కమిటికి పంపిన అనంతరం ఆయన సభను రద్దు చేయకుండానే నేరుగా తన చాంబర్కు వెళ్లారు. అక్కడి నుంచే సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మండలిలో జరిగిన పరిణామాలతో తీవ్రంగా మనస్తాపం చెందిన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. చైర్మన్ షరీఫ్ నిర్ణయంతో టీడీపీ శ్రేణులు షాక్కు గురయ్యాయి.