అధిరార, విపక్ష పార్టీలు ఎప్పడూ అంతేనులే. వైరి పక్షాలే. ఒకరు అవునంటే.. మరొకరు కాదంటారు. అది ఏ అంశమైనా అంతే అలాగే వ్యవహరిస్తారు. పీడీ వాదంలా తయారైంది ఇది. మొత్తంగా చెప్పాలంటే రాజకీయమంటేనే అదే. ఇది మరోసారి రుజువైంది. చంద్రబాబు మార్క్ రాజకీయం. అధికార వైసీపీ పార్టీని టార్గెట్ చేసుకుని సాగింది. కాకపోతే ఒక్కటే తేడా అప్పడు వద్దని, ఇప్పడు కావాలని. అప్పుడు తండ్రి. ఇప్పుడు తనయుడు. ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చంతా ఇప్పుడిదే. ఇంతకీ ఏ విషయమంటారా? అదేనండి శాసన మండలి రద్దు గురించి. శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సోమవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్ష పార్టీల నేతలు మాట్లాడారు.
అయితే టీడీఎల్పీ నేత చంద్రబాబు చేసిన ప్రసంగమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దానిపై చర్చంతా సాగుతున్నది. 2004లో అధికారం చేపట్టిన తరువాత అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి తిరిగి ఏపీలో శాసనమండలిని 2007 పునరుద్ధరించిన విషయం తెలిసింది. ఆ సందర్భంగా అప్పటి అసెంబ్లీలో జరిగిన చర్చలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. శాసనమండలితో ఒనగూరే ప్రయోజనాలు ఏమీ లేవని, అది బిల్లులను 4 నెలలు మాత్రమే అడ్డుకోగలదని వాదించారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ స్వలాభం కోసం శాసనమండలిని పునరుద్ధరిస్తున్నదని దుమ్మెత్తి పోశారు. ఇదిలా ఉండగా సోమవారం బీఏసీ సమావేశం నిర్వహించిన అనంతరం మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రవేశపెట్టారు. దానిపై చర్చను స్పీకర్ తమ్మినేని చేపట్టారు. అనాటి చంద్రబాబు ప్రసంగానికి సంబంధించిన వీడియోలను సైతం వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రదర్శించింది. అయినప్పటికీ చంద్రబాబు గతంలో తాను చేసిన వాదనలకు భిన్నంగా ప్రసంగించారు. శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. పనిలోలో పనిగా తాము అధికారంలోకి వస్తే తిరిగి పునరుద్ధరిస్తామని బాబు ప్రకటించడం గమనార్హం. బాబు ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. అంతేలే ప్రతిపక్షమంటే అదే కాబోలు అని అందరూ అనుకుంటున్నారు. జనాలు మాత్రం నవ్వు కుంటున్నారు.