ఇటీవలి కాలంలో భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ట్రంప్ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను మరింత బలపడుతున్నాయి. అందులో భాగంగా తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన దాదాపుగా ఖరారైంది. వచ్చే నెలలో తొలిసారిగా ఆయన భారత్ను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు భారత్లోని పర్యటించనున్నారు. ఇప్పటికే ట్రంప్ కోసం అమెరికా అధికారులు గతంలో అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్లు బస చేసిన ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్ను కూడా బుక్ చేసినట్లు తెలిసింది. అదే సమయంలో భారత్, అమెరికాల పలు కీలక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. అదేవిధంగా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశముంది. ట్రంప్పై అభిసంశన తీర్మానంతో పాటు మరి కొద్ది రోజుల్లో అమెరికాలో ఎన్నికల ప్రచారం ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలా ఉండగా.. హౌడీ మోదీ తరహాలోనే ట్రంప్ పర్యటన సందర్భంగా భారత్లోనూ భారీ సభ నిర్వహించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే అక్కడి అధికారులతో భారత్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సభకు అహ్మదాబాద్ వేదికయ్యే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కొందరు అధికారులు తెలిపారు. ట్రంప్ పర్యటనతో ద్వైపాక్షి వాణిజ్యంలో మెరుగైన సంబంధాలు మరింత బలపడుతాయని, తరుచూ ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భారత వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ప్రధానిగా మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 గణతంత్ర దినోత్సవ వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా విచ్చేశారు. అంతకుముందు బిల్ క్లింటన్ భారత్ ను సందర్శించారు.