ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. పార్టీ ఓడిపోయిన 2014 ఎన్నికలలోను నెల్లూరు ఎంపీ సీటుతో పాటు ఏకంగా ఏడు అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ ఓడిన మూడు స్థానాలు కూడా అతి స్వల్ప తేడాతో కోల్పోయింది. ఇక గత ఎన్నికలలో అయితే ఎంపీ సీటుతో పాటు పదికి పది అసెంబ్లీ సీట్లు వైసిపి ఖాతాలో పడ్డాయి. ఆ మాటకు వస్తే వైసిపి ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి కంచి కోటగా ఉంటూ వస్తుంది. అలాంటి కంచు కోటలో వచ్చే ఎన్నికలలో వైసీపీకి అన్ని నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు దొరుకుతారా ? అంటే సందేహాలే వినిపిస్తున్నాయి.
విచిత్రం ఏంటంటే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసింది. మిగిలిన ఎమ్మెల్యేలలో కూడా కొందరిపై పార్టీ మార్పు ప్రచారాలు జరుగుతున్నాయి. అలాంటి ప్రచారాలు లేని ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలలో నిండా మునిగిపోయారు. కోటంరెడ్డి, ఆనం తిరుగుబాటు చేసిన తర్వాత జిల్లాలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఇద్దరు నేతలు పోయినా మాకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నట్టుగా వారిని ఘోరంగా అవమానించి బయటకు పంపేశారు.
ఆ ఇద్దరి నియోజకవర్గాలలో కొత్త ఇన్చార్జిలను కూడా జగన్ పెట్టేశారు. ఇక అప్పటినుంచి నెల్లూరు జిల్లాలో వైసీపీకి కొత్త ఉక్క పోత మొదలైంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి అనిల్ పరిస్థితి దారుణంగా ఉంది. అసలు ఈసారి ఆయనకు టిక్కెట్ ఇవరని ప్రచారం జరుగుతోంది. ఆయనను పక్కనపెడితే మరో బలమైన నేత కూడా సిటీలో లేరు. ఇక నెల్లూరు రూరల్ కు ఆదాలను అభ్యర్థిగా ప్రకటించినా ఆయన వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారన్న చర్చలు పార్టీ వర్గాల్లోనే ఉన్నాయి.
ఉదయగిరిలో మేకపాటి పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు అక్కడ కొత్త అభ్యర్థి కోసం వెతుకులాట మొదలైంది. ఇక కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి టిడిపిలోకి వెళతారన్న ప్రచారం జరిగినా ప్రస్తుతానికి ఆయన దానిని ఖండించారు. కావలి ఎమ్మెల్యే పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారని.. ఆయనకు కూడా టికెట్ రాదని ప్రచారం జరుగుతుంది. ఇక గూడూరు – సూళ్లూరుపేట ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు లేవని అంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా పార్టీ అధిష్టానం వర్గాలుగా విభజించి పాలించడమే ఈ సమస్యకు కారణం అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈసారి నెల్లూరు జిల్లాలో వైసిపి పరిస్థితి ఏటికి ఎదురు ఈదుతున్నట్టుగానే ఉంది.