సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరడంతో గుంటూరు జిల్లా టిడిపి రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. పార్టీలో చేరిన కన్నాకు చంద్రబాబు ఏ సీటు కేటాయిస్తారు ? అన్నది గత కొద్ది రోజులుగా ఉత్కంఠ గా మారింది. అయితే ఎట్టకేలకు చంద్రబాబు ఈ ఉత్కంఠకు తెరదించేశారు. కన్నా గతంలో పెదకూరపాడు నుంచి నాలుగు సార్లు.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు బిజెపిలోకి వెళ్లిన కన్నా నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పుడు టిడిపి నుంచి కన్నా.. ఆయన గతంలో గెలిచిన పెదకూరపాడు లేదా గుంటూరు పశ్చిమ లేదా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేస్తారు అంటూ గట్టిగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా చంద్రబాబు కన్నాకు సత్తెనపల్లి సీటు ఖరారు చేశారు. కన్నా కూడా త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని సత్తెనపల్లిలో ఆఫీస్ కూడా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన తన ఆఫీసు కోసం అనువైన ఇంటిని కూడా ఎంపిక చేసుకున్నారు.
కన్నాకు టిడిపి టికెట్ ఖరారు అయిందన్న విషయం లీక్ కావడంతో సత్తెనపల్లి టిడిపి టిక్కెట్ ఆశించిన నేతలు చంద్రబాబుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇప్పటి వరకు సత్తెనపల్లి టిడిపి టికెట్ ఆశించిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాంతో పాటు నాగోతు సౌరయ్య, మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు, యువనేత అబ్బూరు మల్లి లాంటి నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు.
ఇక రాయపాటి ఫ్యామిలీ కూడా అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కన్నా లక్ష్మీనారాయణ సీటు విషయంలో అయితే క్లారిటీ వచ్చేసింది. రేపటి ఎన్నికలవేళ జనసేనతో టిడిపి పొత్తు ఉంటే తెనాలి – గుంటూరు పశ్చిమ సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు వెళతాయని తెలుస్తోంది. ఇక కన్నా ఈసారి సత్తెనపల్లి నుంచి తన సరికొత్త రాజకీయాన్ని ప్రారంభించనున్నారు.
సత్తెనపల్లిలో కూడా కమ్మ సామాజిక వర్గంతో పాటు.. కాపు సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అక్కడ వైసిపి నుంచి కాపు వర్గానికి చెందిన అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన కన్నా ఎంట్రీతో సత్తెనపల్లి రాజకీయం రసవత్తరం కానుంది.