ఆ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ ఫోన్‌… స్విచ్ఛాఫ్‌.. నిన్న ఉద‌యం ఏం జ‌రిగింది…?

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఊహించ‌ని రీతిలో గెలుపొందారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ టీడిపికి కలిసిరాగా… వైసీపీ అభ్యర్థి కోలా గురువులు ఓడిపోయారు. వైసీపీ నుంచి మొత్తం నాలుగు ఓట్లు టీడిపి అభ్యర్థికి క్రాస్ అయ్యాయి. వీరిలో ఇద్దరు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఇద్దరు సంచలన విజయం సాధించారు. ఇక క్రాస్ ఓటింగ్ చేసిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు ? అన్నదానిపై ఇప్పటికే వైసిపి వర్గాలు, ఆ పార్టీ అధినాయకత్వం ఓ అంచ‌నాకు వచ్చేసాయి.

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా… ఆమె మాత్రం తాను పార్టీ ఇచ్చిన కోడ్ ప్రకారమే ఓటు వేశాను అని.. గురువారం ఉదయం తన కుమార్తెతో కలిసి జగన్ గారిని కూడా కలిశాను.. ఆయన నుంచి నాకు స్పష్టమైన హామీ వచ్చింది అని చెబుతున్నారు. క్రాస్ ఓటింగ్ చేసిన ఆ దొంగ ఎవరో రెండు రోజుల్లో నిజానిజాలు బయటికి వస్తాయని తాను విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నామని.. దళిత మహిళలు కాబట్టే తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పై కూడా అనుమానాలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వైసిపి పెద్దల నుంచి ఆయనకు వరుసగా ఫోన్ కాల్స్ వెళ్లినా ఎలాంటి ? రియాక్షన్ లేదట. కొన్నిసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ అని కూడా వస్తుందని తెలుస్తోంది. కనీసం రిటర్న్ కాల్ కూడా రాకపోవడంతో అధిష్టానం అనుమానమే నిజమైందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గానికి చంద్ర‌శేఖ‌ర్‌ ఎమ్మెల్యేగా ఉండగా ధనుంజయ రెడ్డిని పార్టీ అధిష్టానం పరిశీలకుడిగా నియమించింది.

దీంతో ఆయన చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఆయన చుట్టూ ఫ్యామిలీ వివాదాలు కూడా ఉన్నాయి. అటు మేకపాటి ఫ్యామిలీలో అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబంతోను విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గురువారం ఉదయం కూడా నెల్లూరు జిల్లాకు సమన్వయకర్తగా ఉన్న ఒక మంత్రి చంద్రశేఖర్ రెడ్డిని సీఎం జగన్ వద్దకు తీసుకు వెళ్లారట. అయితే వచ్చే ఎన్నికలలో తాను సీటు ఇవ్వలేనని.. ఏవైనా పనులు ఉంటే చేసి పెడతానని జ‌గ‌న్‌ నేరుగానే చెప్పినట్టు తెలుస్తోంది. చివరకు మేకపాటి తన కుటుంబంలో ఎవరో ? ఒకరికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్న జగన్ పట్టించుకోలేదట. ఈ కారణాలతోనే ఆయన టీడిపికి క్రాస్ ఓటింగ్ వేసి.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని సైలెంట్ అయినట్టు తెలుస్తోంది.

Tags: ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp